అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని షాక్ ఇది. వీసాల విషయంలో ఈ దేశం తీసుకుంటున్న నిర్ణయం విషయంలో పెద్ద ఎదురుదెబ్బ. ఓ తెలుగోడికి ఆయన కంపెనీ అండగా నిలిచింది. ఆయన కోసం అమెరికా ప్రభుత్వంపై కోర్టులో కేసు వేసింది. ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలోని ఎక్స్టెర్రా సొల్యూషన్స్ సంస్థ 28 సంవత్సరాల ప్రహర్ష చంద్ర సాయి వెంకట అనిశెట్టి అనే వ్యక్తిని బిజినెస్ సిస్టమ్ అనలిస్ట్గా నియమించుకుంది. అనంతరం హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆయనకు యూఎస్ సిటిజన్షిప్ ఆండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వీసా నిరాకరించింది. అయితే, దీనిపై ప్రహర్షకు ఉద్యోగం కల్పించిన ఎక్స్టెర్రా సొల్యూషన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ప్రహర్ష విషయంలో యూఎస్సీఐఎస్ తీసుకున్న నిర్ణయంపై కోర్టులో వాదించింది. ప్రహర్షకు హెచ్1బీ వీసా నిరాకరిస్తూ, ప్రత్యేక నైపుణ్యాలకు ఆయన అర్హుడు కాదని పేర్కొనడం వాస్తవం కాదని తెలిపింది. అమెరికాలో టెక్సాస్ యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేయడంతో పాటుగా, అనంతరం సంబంధించిన వృత్తి శిక్షణను సైతం పూర్తి చేసుకొని తదుపరి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారని సంస్థ పేర్కొంది. బిజినెస్ అనలిస్ట్గా అన్ని అర్హతలు పరిగణనలోకి తీసుకొని కేటాయించినప్పటికీ, ఏకపక్షంగా వీసా నిరాకరించారని తన వాదనల్లో సంస్థ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. నిర్దేశిత అర్హత కాకుండా ఉన్నత విద్యాభ్యాసం కలిగి ఉన్నారని వీసా కేటాయించకపోవడం సరికాదని వాదించారు. తన భార్య ఉద్యోగి కావడంతో హెచ్4 వీసా కలిగి ఉన్న ప్రహర్ష ఉద్యోగంలో చేరిన అనంతరం ఇచ్చిన వీసా విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని కోరింది.