అస్సాం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రజలంతా చేతికందిన సామానుతో చెట్టుకొకరు, పుట్టకొకరు అయిపోయారు. తలదాచుకునేందుకు ఏచిన్న గూడు దొరికినా చాలనుకుంటూ బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ వరదలకు మనుషులతో పాటు కాజీరంగా నేషనల్ జూలోని మూగజీవాలు కూడా నీడ కోల్పోయాయి. అలా వెళ్లిపోయిన జీవాల్లో ఓ పెద్దపులి ఉంది. పక్కనున్న గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి బెడ్ రూమ్ లో తల దాచుకుంది. ప్రస్తుతం ఈ వార్తనెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
జూ ప్రాంతంలోని బగోరీ రేంజ్ లో హర్మోటి అనే గ్రామంలో జరిగిందీ ఉదంతం. నేషనల్ హైవే పక్కనున్న మోతీలాల్ అనే వ్యక్తికి చెందిన పాత సామాను దుకాణంలోకి బెంగాల్ టైగర్ వచ్చి ఆ ఇంట్లోని గదిలోకి వెళ్లి తాపీగా మంచం మీద కూర్చుంది. అప్పటికే బయట నుంచి 'పులి పులి' అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. ఎదురుగా 20 అడుగుల దూరంలో బెంగాల్ టైగర్ ని చూసిన మోతీలాల్ మొద్దుబారిపోయి అక్కడే అలాగే నిల్చుండిపోయాడు. అయితే, బాగా అలిసిపోయినట్టు కనిపిస్తున్న ఆ పులి నెమ్మదిగా దుకాణం లోపలికి వెళ్లిపోయింది.
పులి లోపలికి వెళ్లిపోగానే.. గ్రామంలోని పశువైద్యుడు శాంశుల్ అలీ అటవీ శాఖ అధికారులకు వెంటనే ఈ విషయం చేరవేశాడు. దీంతో అక్కడికొచ్చిన అధికారులు బృందం.. కజిరంగా జాతీయ పార్కు భూభాగం 95శాతం నీట మునిగిందని, దాంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇతర వన్యప్రాణుల్లాగే పులి కూడా జనావాసాల్లోకి వచ్చిందని అంచనా వేశారు. పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి మళ్లీ పార్కులోకి తీసుకెళ్లి వదిలేయాలా? లేక తన దారిని అది పోయేదాకా వేచిఉందామా అని అధికారులు ఆలోచిస్తున్నారు.