హర్భజన్సింగ్ ఇన్నాళ్లకు ఓ ఇంటి వాడయ్యాడు. వివాహం పూర్తయింది. వివాహానంతర రిసెప్షన్ , భారీ విందు కూడా పూర్తయింది. ప్రధాని సహా రాజకీయ, క్రీడా,సినీ రంగ ప్రముఖులు ఎంతో మంది ఈ విందుకు హాజరయ్యారు. మామూలుగా అయితే ఈ పాటికి ఎంచక్కా.. హనీమూన్ అంటూ విలాసాల్లో, వినోదాల్లో గడుపుతూ ఉండాల్సిన పరిస్థితి. ఆనీ భజ్జీ ముసురుకుంటున్న పోలీసు కేసుల్తో సతమతం అవుతున్నాడు. తన పెళ్లి వ్యవహారాలతో ముడిపెట్టి రెండుసార్లు హర్భజన్ క్షమాపణలు కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
ఇంతకూ విషయం ఏంటంటే.. తాజాగా అయినవాళ్లే హర్భజన్ మీద పంజాబులో పోలీసు కేసు పెట్టారు. సిక్కు మత విశ్వాసాలను ఆయన మంటగలిపారని, మత విశ్వాసాలను గాయపరిచేలాచేశారని ఆయన మీద సిక్కు మత పెద్దలు పోలీసు కేసు పెట్టారు. నిజానికి సిక్కు మతంలో వివాహాలు, మరే ఇతర వేడుకల్లో మద్యం, తదితర మత్తు పదార్థాలు ఏవీ విందులో వాడడం నిషిద్ధం. అయితే హర్భజన్సింగ్ వివాహ రిసెప్షన్లో విచ్చలవిడిగా భారీగా మద్యం వినియోగించారనేది సిక్కు మత పెద్దల ఆరోపణ. దేశీయ, విదేశీ బ్రాండ్ల మద్యాన్ని అతిథుల కోసం విచ్చలవిడిగా సర్వ్ చేశారని.. మతవిశ్వాసాలను గాయపరచినందుకు ఆయన మీద కేసు నమోదు అయింది. బహుశా హర్భజన్ స్వయంగా మతపెద్దల ముందుకు వచ్చి.. వారికి క్షమాపణలు చెప్పుకుంటే.. ఆ సమస్య తొలగిపోవచ్చు.. కానీ తన పెళ్లితో ముడిపడి ఆయన రెండోసారి క్షమాపణలు చెప్పుకోవడం అవుతోంది.
ఇప్పటికే ఆయన పెళ్లి కవరేజికి వచ్చిన మీడియా వారిపై బౌన్సర్లు దాడి చేయడం దానికి సంబంధించి భజ్జీ క్షమాపణలు చెప్పడం అందరికీ గుర్తుండే ఉంటుంది. దానికి తగినట్లు ఇప్పుడు భజ్జీ మళ్లీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చేలా కనిపిస్తోంది.