తెలంగాణ ఎంసెట్-2 అధికారికంగా రద్దైంది. ఎంసెట్-3 షెడ్యూల్ ఈ సాయంత్రం విడుదల చేయనున్నారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంసెట్ కన్వీనర్ ను మార్చాలని కేసీఆర్ నిర్ణయించారు. మళ్లీ జేఎన్టీయూకు ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని, పాత హాల్ టికెట్లతోనే పరీక్షకు అనుమతించాలని సీఎం సూచించారు.



కొద్దిసేపటి క్రితం తన క్యాంపు కార్యాలయంలో లీకేజీ వ్యవహారంపై సమీక్ష చేసిన కేసీఆర్ కు సీఐడీ అధికారులు దర్యాప్తు నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్... లీకేజీ వ్యవహారాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. ఢిల్లీ కేంద్రంగా సాగిన లీకేజీ వ్యవహారంలో మొత్తం 34 మంది బ్రోకర్లున్నారని కేసీఆర్ చెప్పారు. 



ముకుల్ జై, మయాంక్ శర్మ, సునీల్ సింగ్, ఇర్ఫాన్ అనే నలుగురు వ్యక్తులు కీలక సూత్రధారులుగా వ్యవహరించారన్నారు. వీరికి తోడు మరో 30 మంది బ్రోకర్లుగా వ్యవహరించారని ఆయన చెప్పారు. ఈ బ్రోకర్లు పరీక్షలు రాసిన 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారని చెప్పారు. వీరందరిపైనా చర్యలు తప్పవని కేసీఆర్ చెప్పారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిలో ఇప్పటికే ఆరుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని, మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారని చెప్పారు. దేశవ్యాప్తంగా పేపర్ల లీకేజీ నడుస్తోందని ఆయన ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: