ఏపీలో సరికొత్త రాజకీయ ముఖచిత్రం కనిపించబోతుందా? కొత్త పొత్తుపొడుస్తాయా? పాత పొత్తులు చిత్తవుతాయా? టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఎవరెవరు ఎవరితో కలుస్తారు..? ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసిందా? తాజా రాజకీయ పరిస్థితులు ఆసక్తిగా మారుతున్నాయి.
ఏపీ రాజకీయ ముఖచిత్రం మళ్లీ మారబోతోంది. కొత్త పొత్తులకు రంగం సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ప్రత్యేక హోదా అంశం పార్టీల పొత్తులపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా కొనసాయి. అయితే ఇప్పుడు వారి బంధం బలహీనమవుతోంది. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్.. బీజేపీ, టీడీపీలపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైసీపీ అధినేత జగన్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేతలులు. వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ... హోదా కోసం తాము ఎవరితోనైనా కలుస్తామని చెప్పారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు, ఏపీకి హామీ ఇచ్చిన మేరకు ప్రత్యేక హోదా తమకు ముఖ్యమని చెప్పారు. అందుకోసం ఎవరితోనైనా కలుస్తామన్నారు. ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాల పైన పవన్ వేసిన ప్రశ్నలకు ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పోరాడితే తమ మద్దతు ఉంటుందన్నారు. ఇన్నాళ్ల పాటు పవన్ పైన వైసీపీ నేతలు దుమ్మెత్తిపోసిన సందర్భాలున్నాయి. ఆయన టీడీపీకి, బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు హోదా విషయంలో మాత్రం అండగా నిలబడతామని చెబుతున్నారు.
కాంగ్రెస్కు పొత్తు ఎవరు? రాష్ట్ర విభజన నిర్ణయంతో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ కనీసం ఉనికి కాపాడుకో వాలంటే ఇతర పార్టీలతో పొత్తులే శరణ్యం అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్తులో పొత్తు ఉండదని తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభసభ్యులు విజయసాయిరెడ్డి వ్యాఖ్యల మర్మమేమిటీ అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. జగన్, పవన్ కాంగ్రెస్ పార్టీలోకి రావాంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్నేత చింతా మోహన్ గతంలో చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు. జగన్, పవన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేంతగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ రకమైన వ్యాఖ్యల ద్వారా ఇప్పటినుంచే ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తాము పొత్తులకు సిద్దం అన్న సంకేతాలిస్తోంది అన్న చర్చ నాడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇతర పార్టీల నేతలను తన పార్టీలో చేర్చుకొనేంత గొప్పస్థితిలో ఏపిలో కాంగ్రెస్ పార్టీ లేకపోవడంతో తామే పొత్తులకు సిద్దం అని చెప్పేందుకు హస్తం నేతలు సంకేతాలు పంపిస్తున్నారని ఇతర ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. చింతమోహన్ వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం నాడు కొంత చర్చజరిగినట్లు సమాచారం. తమతో పొత్తుకోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని వైసిపి నేతలు కొందరు అంటున్నారు కూడా. ఈ విషయాన్ని అంతర్గతంగా ఏపి కాంగ్రెస్ నేతలు సైతం పరోక్షంగా ధృవీకరించారు.
ఇదిలావుంటే జనసేన అధినేత పవన్ను కూడా కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ తమ పార్టీలోకి గతంలో ఆహ్వానించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కాంగ్రెస్లోకి వస్తారని కాదు కనీసం ఆ పార్టీని పొత్తుల ద్వారా అక్కున చేర్చుకొంటారేమోనన్న ఉద్దేశంలో భాగమే చింతా మోహన్ వ్యాఖ్యలు అని ఆ సమయంలోనే రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కానీ పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పార్టీల పక్షాన నిలిచారు. అయితే కాంగ్రెస్కు పవన్ దగ్గరయ్యే అవకాశాలు నామమాత్రంగా లేవని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోరాటం చేయాల్సి ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే చివరికి పవన్ ఎవరితో కలుస్తాడనేది ఇప్పటి వరకు సస్పెన్స్ అనే చెప్పుకోవచ్చు.