బినామీలపై సునామీ లా విరుచుకుపడతామన్న మోదీ సర్కార్... ఆ పని ప్రారంభించింది. భారీ జరిమానాలతోపాటు గరిష్ఠంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్షకు వీలు కల్పించే బినామీ లావాదేవీల నిరోధక చట్టాన్ని ప్రయోగించడం మొదలుపెట్టింది. పెద్దనోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించిన వారికి ఈ చట్టం కింద నోటీసులు పంపడం ప్రారంభించింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల విలువైన 42 ఆస్తులు (బ్యాంకు ఖాతాల్లోని సొమ్ములు, స్థిరాస్తులు) జప్తు (అటాచ్) చేసింది. దీనికి సంబంధించి 87 మందికి శ్రీముఖాలు పంపినట్లు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోమవారం ప్రకటించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత బడాబాబులు నలుపును తెలుపు చేసుకోవడానికి తమ బంధువులు, స్నేహితులు, ఉద్యోగుల ఖాతాలను వాడు కున్నారు. ‘నల్ల దొరలకు మీ ఖాతాలు అరువుగా ఇస్తే ఇబ్బందులు తప్పవు’ అని ఐటీ శాఖ పదేపదే హెచ్చరించింది.
పత్రికలు, ఇతర ప్రసార సాధనాల్లో ప్రకటనలు జారీ చేసింది. దీంతోపాటు ఇతరులు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తుల ను తమ పేరిట ఉంచుకున్న వారిపైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇప్పుడు... ఆయా లావాదేవీలపై ఆరా తీయడం ప్రారంభించింది. ‘‘కొన్ని లావాదేవీలు, ఆస్తులపై లోతుగా దర్యాప్తు చేశాం. 87 మందికి నోటీసులు జారీ చేశాం. బినామీ చట్టం కింద 42 ఆస్తులను జప్తు చేశాం. వీటి విలువ కోట్లలోనే ఉంటుంది’’ అని ఐటీ అధికారులు ప్రకటించారు. బినామీ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికార బాధ్యత ఐటీ శాఖదే. ఆ శాఖ అధికారులు ఈ చట్టం కింద ఇప్పటికే అనేకమందికి సమన్లు జారీ చేశారు. ఆస్తులు, లావాదేవీలపై వారివివరణ కోరారు. ఇలా మరికొంతమందికి కూడాసమన్లు సిద్ధమవుతున్నా యి. పెద్దనోట్ల రద్దు తర్వాత భారీ మొత్తంలో డబ్బు జమ అయిన జన్ధన్, బినామీ ఖాతాలు, కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న ఖాతా లన్నింటినీ ఐటీ సిబ్బంది నిశితంగా పరిశీలిస్తున్నారు.
దశాబ్దాల క్రితమే పార్లమెంటు ఆమోదం పొందిన బినామీ చట్టాన్ని... మోదీ సర్కారు గత ఏడాది నవంబరు 1న అమలులోకి తెచ్చింది. ‘‘ఇప్పుడు నా వద్ద ఉన్న పాత 500, వెయ్యి నోట్లు నీ ఖాతాలో వేస్తాను. ఆ తర్వాత నాకు కొత్త కరెన్సీ ఇవ్వు! ఎంతో కొంత కమీషన్ ముట్టజెబుతా’’ అనే ఒప్పందంపై జరిగిన లావాదేవీలనీ బినామీ కిందికే వస్తాయి. పాత కరెన్సీని డిపాజిట్ చేసిన వ్యక్తిని లబ్ధిదారుడిగా, ఖాతా ఉన్న వ్యక్తిని బినామీదారుగా పరిగణిస్తారు. వీరిలో బినామీదారుడికి ఏడాది నుంచి గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది. ఈ చట్టం కింద లావాదేవీ మొత్తాన్ని ఐటీ శాఖ స్వాధీనం చేసుకోవచ్చు. అదే స్థిరాస్తి విషయానికి వస్తే, మార్కెట్ విలువలో 25 శాతం మొత్తాన్ని జరిమానాగా విధించవచ్చు. ఇప్పటికి దేశవ్యాప్తంగా రూ.5343 కోట్ల మేరకు ‘లెక్కకు రాని’ ఆదాయాన్ని ఐటీ శాఖ గుర్తించింది.
పెద్దనోట్ల రద్దు నుంచి... వాటిని డిపాజిట్ చేసేందుకు గడువు ముగిసే దాకా (నవంబరు 9 నుంచి డిసెంబరు 30 వరకు) ఎన్ని ఖాతాల్లో రూ.2.50 లక్షల కంటే అధికంగా డిపాజిట్ అయ్యాయి? ఒకే వ్యక్తికి సంబంధించిన వేర్వేరు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా? ఆ ఖాతాదారుల ఆర్థిక నేపథ్యం ఏమిటి? ఆ లావాదేవీలు అనుమానాస్పదం గా ఉన్నాయా? ఇవన్నీ సమగ్రంగా విశ్లేషించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ బాధ్యతను రెండు ప్రైవేటు సంస్థల (మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్స్) కు అప్పగించాలని ఐటీ శాఖ నిర్ణయించుకుంది. దీనిపై సోమవారం టెండర్లు ఆహ్వానించింది. ఒక అంచనా ప్రకారం, సుమారు 30 లక్షల నుంచి 40 లక్షల ఖాతాలను విశ్లేషించాల్సి ఉంటుంది. నోట్ల రద్దుకు ముందు (గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబరు 8వరకు) ఆ ఖాతాల్లో జరిగిన లావాదేవీలను కూడా పరిశీలిస్తారు. ఈ మొత్తం సమాచారాన్ని విశ్లేషించి ‘అనుమానాస్పద లావాదేవీల నివేదిక’ (ఎస్టీఆర్) ఆర్థిక నిఘా విభాగం (ఎఫ్ఐయూ)కు సమర్పిస్తారు. మొత్తంగా రెండు లక్షల ఖాతాల్లో అనుమానాస్పద వ్యవహారాలు జరిగి ఉంటాయని ఒక అంచనా.