ఇన్నాళ్లూ.. శశికళ ఆధిపత్యంపై మౌనంగా ఉన్న పన్నీర్ సెల్వం.. ఎందుకు ఒక్కసారిగా పెదవి విప్పారు.. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని కుండబద్దలుకొట్టారు. తాను రాజీనామా వెనక్కు తీసుకునేందుకు సిద్ధం అన్ని ప్రకటించారు.. ఒక్కసారిగా ఆయనకు అంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది.
స్వతహాగా మృదు స్వభావి అయిన పన్నీర్ ఇప్పుడు ఏ అండ చూసుకుని తిరుగుబాటు చేశారు.. ఇప్పుడు ఇవన్నీ అందరినీ ఆలోచింప చేస్తున్నాయి. నిన్నటి వరకూ శశికళకు అంతా పూలబాటగా కనిపించడం వల్ల పన్నీర్ సెల్వం కామ్ గా ఉండిపోయారు. కానీ ఆమెపై ఉన్న అవినీతి కేసు వారంరోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉండటం పన్నీర్ కు ధైర్యాన్నిచ్చింది.
దీనికితోడు మంగళవారం ఉదయం అనూహ్యంగా పార్టీ నేతలు శశికళ ప్రవర్తనపై ధ్వజమెత్తటం.. ఆమె జయలలిత మరణానికి కారణమైందని నోరు విప్పడటంతో పన్నీర్ సెల్వం..
ధైర్యం చేశారు. దీనికితోడు శశికళ ప్రమాణ స్వీకారం ఆలస్యం కావడం, న్యాయపరమైన చిక్కులు ఉండటం కూడా పన్నీర్ సెల్వానికి ధైర్యాన్నిచ్చాయి. వీటికి తోడు ప్రజల్లో శశికళపట్ల అంత సానుకూలత లేకపోవడం కూడా పన్నీర్ కు కలసివచ్చింది.
జయవిధేయుడుగా విపరీతమైన ట్రాక్ రికార్డు ఉండటం.. చేసిన కొద్దికాలమైనా జల్లికట్టు, వార్తా తుపాను సమయాల్లో సమర్థంగా పనిచేయడం కూడా పన్నీర్ పట్ల ప్రజల్లో సానుభూతి పెంచాయి. శశికళ కూడా పదవి కోసం పాకులాడుతున్నట్టు కనిపించడం పన్నీర్ కు మరింతగా కలసి వచ్చింది. మరి పన్నీర్ తిరుగుబాటు విజయవంతం అవుతుందా లేదా వేచి చూడాలి.