భారత్ పాక్ సరిహద్ధులు నిత్యం రక్తమొడుతూనే ఉన్నాయి. పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఎప్పటిలా తూట్లు పొడుస్తూనే ఉంది. పాక్ సైన్యం దురాగతాలతో ఇలా దొడ్డిదారిన భారత్ తో యుద్దం చేస్తూనే ఉంది. మరోపక్క ఉగ్రవాద తండాలు ఐ.ఎస్.ఐ దన్నుతో భారత్లో ప్రవేసించటమూ మానట్లేదు. మూడుసార్లు భారత్ తో యుద్దం చేసి పరువు పోగొట్టుకున్నా పాక్ తన నైజం మార్చుకొనే పరిస్థితులు కనిపించటం లేదు.
మరోవైపు జమ్మూ కశ్మీర్లో పాక్ ప్రేరిత ఉగ్రవాదం కోరలు చాస్తూనే ఉండటం, పాక్ సైన్యం తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ మన సైనికులను పొట్టన పెట్టుకోవడం లాంటివి కూడా భారత్కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ విషయా లన్నింటినీ భారత్ తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీజే తీర్పును గౌరవించకుండా.. జాదవ్ను ఉరి తీసే విషయం లో పాక్ ఇంకా అలాగే ముందుకు వెళితే తీవ్ర పరిణామాలే ఉంటాయని సంకేతాలు అందుతున్నాయి.
నిత్యం రెచ్చగొడుతున్న పాకిస్థాన్పై కఠిన చర్యలకు రంగం సిద్ధమవుతోందా? భారతీయ వాయు సేన (ఐఏఎఫ్) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా 12వేల మంది ఐఏఎఫ్ అధికారులకు మార్చి 30 న వ్యక్తిగతంగా లేఖలు రాశారు. పేరు పేరునా వ్యక్తిగతంగా లేఖలు రాయడం దేనికి సంకేతం? అతి త్వరలోనే ఆపరేషన్స్ కు సర్వసన్నద్ధంగా ఉండాలని ఎందుకు ఆదేశించారు? నియంత్రణ రేఖ వెంబడి పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు చేస్తున్న దాడులను అడ్డుకునేందుకు వాయుసేనను రంగంలోకి త్వరలో దింపబోతున్నారనడానికి ఈ లేఖ సంకేత మని అంటున్నారు.
"అతి కొద్ది సమయంలో ఆపరేషన్లకు సిద్ధం కావాలి. ప్రస్తుత పరిస్ధితుల్లో దాయాది దేశంతో పెద్ద ప్రమాదం పొంచి వుంది. అతి కొద్ది రోజుల్లో అందుబాటులో ఉన్న వనరులతో ఆపరేషన్స్కు దిగాల్సిన పరిస్ధితి ఉంది. ఇందుకోసం మీరందరూ మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి. ట్రైయినింగ్లో అందుకు తగిన విధంగా తర్పీదు పొందాలి" ఇది ఆ లేఖ సారాంశం.
ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ సంఘర్షణ ముప్పు తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులోనే మన ప్రస్తుత సాయుధ సంపత్తితో ఆపరేషన్స్కు సర్వసన్నద్ధంగా ఉండవలసిన అవసరం ఉందని తెలిపారు. దీనికోసం శిక్షణపై దృష్టి సారించవలసి ఉందన్నారు. వాయు సేనలో నియామకాలు, పదోన్నతుల విషయంలో పక్షపాతం, లైంగిక వేధింపుల గురించి కూడా ఈ లేఖలో ప్రస్తావించారు.
ప్రత్యేక ఆపరేషన్స్కు అధికారుల ఎంపికలో నిజాయితీ కనిపించడం లేదని ఆవేదనను లేఖలో వెలిబుచ్చారు ధనోవా. సీనియర్లు జూనియర్లను ప్రోత్సహించాలే తప్ప వేధించకూడదని అది సేనకు ఎంతమాత్రం సహాయపడదని చెప్పారు. ఈ రెండు ప్రొఫెషనలిజాన్ని దెబ్బతీస్తాయని.. ప్రొఫెషనలిజం దెబ్బతిన్న చోట గెలుపు ఉండదని వ్యాఖ్యానించారు.
ఐఏఎఫ్ చీఫ్గా ధనోవా మూడు నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు. పాకిస్థాన్ ప్రచ్ఛన్న యుద్ధం గురించి ధనోవా తన లేఖలో ప్రస్తావించారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సాయుధ సంపత్తి అని పేర్కొనడం వెనుక ఉద్దేశాన్ని విశ్లేషిస్తూ ఐఏఎఫ్ వద్ద ఫైటర్ స్క్వాడ్రన్లు చాలా తక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 42 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ స్క్వాడ్రన్లకు బదులు ప్రస్తుతం 33 మాత్రమే ఉన్నాయంటున్నారు. ఇదిలావుండగా, ఐఏఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ఈ లేఖ అంతర్గత సమాచారానికి సంబంధించినదని తెలిపారు. మరిన్ని వివరాలను తెలిపేందుకు నిరాకరించారు.