రాజకీయాల విషయంలో ఎలా ఉన్నా.. కొన్ని విషయాలు కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతాయేమో అనిపిస్తుంది. తన ఇంట్లో పని చేసే ఓ యువకుడి పెళ్లికి అన్నీ తానే పెద్దగా మారిన ఈ ఉదంతం చూస్తే ఆయనలోని మానవతామూర్తి మరోసారి సాక్షాత్కరిస్తాడు. కేసీఆర్ తన తోటి మనిషికి ఇచ్చే విలువ ఎంత గొప్పదో ఇట్టే అర్థమవుతుంది. 



కేసీఆర్ ఇంట్లో కోడేరు సతీశ్ అనే కుర్రాడు ఎప్పటి నుంచో పని చేస్తున్నాడు. ఆ కుర్రాడిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అతనికి ఇటీవల హైదరాబాద్ కు చెందిన శిరీష అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ దంపతులు అన్నీ తామై అయి దగ్గరుండి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నారు. సీఎం నివాసమైన ప్రగతి భవనే ఈ పెళ్లికి వేదికగా మారింది. 



ఆదివారం జరిగిన ఈ వివాహానికి కేసీఆర్ దంపతులతో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ కవిత, మిషన్ భగీరథ వైఎస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, టీ న్యూస్ ఎండీ సంతోష్‌తో పాటు పలువురు అధికారులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.



గతంలోనూ ఓసారి ఇలాగే కేసీఆర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. తన కారు డ్రైవర్ ఇంట్లో పెళ్లికి స్వయంగా హాజరయ్యారు. ఇలాంటి ఘటనలే వారు తమ తోటివారికి ఇచ్చే విలువను గుర్తు చేస్తారు. వారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతాయి. కేసీఆర్ బాటలోనే ఆయన పార్టీ నాయకులు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే బావుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: