తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. డబుల్ బెడ్ రూమ్, మిషన్ భగీరథ, స్వచ్చ్ హైదరాబాద్ ఇలా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకు వచ్చారు. ఇక జాతీయ జెండా గౌరవసూచకంగా తెలంగాణలో అతి పెద్ద జెండాను ఆవిష్కరించారు. అంతే కాదు 2018 డిసెంబర్ 6 నాటికి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం పనుల్లో జాప్యంపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది అంబేడ్కర్ జయంతిరోజు మాట్లాడిన సీఎం కేసీఆర్, రాజధానిలో 125 అడుగుల విగ్రహం, స్మృతివనం ఏర్పాటుచేస్తామని ప్రకటించి, పనుల పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేశారు.
అయితే విగ్రహ నమూనా ఇంకా సిద్ధం చేయకపోవడంపై డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు నాటికి విగ్రహ నమూనా తయారీ సంస్థను ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్లో గ్లోబల్ టెండర్లు పిలవాలని సూచించారు. నవంబరు నాటికి ఒప్పందాలు పూర్తి చేసి తర్వాత ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని సూచించారు.