మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగా మారింది టీ కాంగ్రెస్ పరిస్థితి. తెలంగాణలో టీఆర్ఎస్పై గట్టిగా ఫైట్ చేసే నాయకుడు టీ కాంగ్రెస్లో ఒక్కడంటే ఒక్కరు కూడా కనపడడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎలా ఎదుర్కోవాలనే అంశం పక్కన పెట్టేసి తామే సీఎం...తామే సీఎం అంటూ అప్పుడే ఫైట్ స్టార్ట్ చేసేశారు. సీనియర్ నాయకులే ఇలా తమలో తాము కలహించుకుంటుంటే ఈ గ్యాప్ను క్యాష్ చేసుకునేందుకు మిగిలిన వారు బెదిరింపు రాజకీయాలకు తెరలేపారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం నేనే అని జానారెడ్డి, ఉత్తమ్రెడ్డి, కోమటిరెడ్డి ఇలా చెప్పుకునేందుకు చాలా మంది ఉన్నారు. ఇక సందట్లో సడేమియాగా మాజీ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ పార్టీలో ఉండాలా ? వెళ్లాలా ? అని టీ కాంగ్రెస్ సీనియర్లకు అల్టిమేటం జారీ చేస్తున్నారట. అసలు సంగతేంటంటే వచ్చే ఎన్నికల్లో వీరితో పాటు వీరి ఫ్యామిలీ మెంబర్లకు తాము కోరుకున్న సీట్లు ఇవ్వాలని వీరు కండీషన్లు పెడుతున్నారట.
డీకే అరుణ వచ్చే ఎన్నికల్లో తన భర్త భరతసింహారెడ్డికి మహబూబ్నగర్ ఎంపీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె గద్వాల్లో ఎమ్మెల్యేగాను, భర్తకు ఎంపీ సీటు కావాలని ఆమె పట్టుబడుతోన్నట్టు తెలుస్తోంది. ఎంపీ సీటు ఇవ్వని పక్షంలో తన దారి తాను చూసుకుంటానని ఆమె టీ పీసీసీ సీనియర్లను బెదిరిస్తున్నారట. ఇక ఆమెకు ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి ఆఫర్లు ఉండడంతో టీ పీసీసీ సీనియర్లు ఆమెకు నో చెప్పలేక టెన్షన్ పడుతున్నారు. అరుణ అసలే ఫైర్బ్రాండ్ లేడీ...ఆమె ఏదైనా చేస్తారు.
ఇక అరుణ భర్త భరతసింహారెడ్డికి మహబూబ్నగర్ సీటు ఇస్తే గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన జైపాల్రెడ్డి తిరిగి చేవెళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్రెడ్డికి ఇబ్బంది తప్పదు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన సబిత ముందే మేల్కొన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన కొడుక్కి చేవేళ్ల ఎంపీ సీటుతో పాటు తనకు మహేశ్వరం ఎమ్మెల్యే సీటు ఇచ్చే విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా పార్టీలోనే ఉండనని అల్టిమేటం జారీ చేశారట.
ఏదేమైనా తెలంగాణలో తిరిగి పట్టుకోసం మూలుగుతోన్న కాంగ్రెస్కు ఇప్పుడు ఈ ఇద్దరు లేడీ మాజీ మంత్రుల బెదిరింపులతో కొత్త టెన్షన్ పట్టుకుందట. దీంతో టీ పీసీసీ నాయకులు వీరిని బాగా బుజ్జగించే ప్రయత్నాలు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.