అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనిని అమలు చేసేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం సమాచార శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అక్రెడిటేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించాలని కమిటీ నిర్ణయించిందని టియూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి క్రాంతి తెలిపారు.
దీనికోసం సదరు సంస్థలో పనిచేస్తున్న ఆధారాలు, అనుభవంతో కూడిన పత్రాలను పొందుపరిచి ఆగస్టు 16 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు.
దరఖాస్తు ఫారాలు ఐ అండ్ పీఆర్ వెబ్ సైట్లో లేదా డీపీఆర్వో కార్యాలయాల్లో నేరుగానైనా పొందవచ్చని పేర్కొన్నారు. హెల్త్ కార్డ్ లేని జర్నలిస్టులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టియుడబ్ల్యూజె కోరింది.
అలాగే ఇప్పటి వరకు రాష్ట్రం లో 14114 మంది జర్నలిస్ట్లకు హెల్త్ కార్డ్స్ యూసర్ ఐడి, పాస్ వార్డ్ పంపించగా వారిలో 5798 మంది మాత్రమే కార్డ్స్ డౌన్ లోడ్ చేసుకోగా 8316 మంది ఇంకా వారి కార్డ్స్ ని డౌన్ లోడ్ చేసుకోలేదన్నారు. చేసుకోని వారు కూడా వేగవంతంగా డౌన్లోడ్ చేసుకుని హెల్త్కార్డులను పొందాలని క్రాంతి పిలుపునిచ్చారు.