ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ గందరగోళం రోజు రోజుకీ పెరిగిపోతుంది. అధికార, ప్రతిపక్షాల మద్య వైరం పెరిగిపోతూనే ఉంది. ఇక నంద్యాల ఉప ఉన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నంద్యాల ఉపఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆయా పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు అధికార, ప్రతి పక్ష నేతలు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ..ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపుతూ నానా యాగి చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పెద్ద మండ్యంలో వైసీపీ యువనేత దారుణహత్యకు గురయ్యారు.
పోలీసుల వివరణ ప్రకారం..పెద్దమండ్యం పాతవూరు జెండామాను వీధికి చెందిన కాలవగడ్డ హుసేన్బేగ్ కుమారుడు సత్తార్బేగ్ (35) కార్పెంటర్గా పనిచేస్తూనే మండల వైసీపీ యూత్ లీడర్గా పనిచేస్తున్నాడు. ఆయన బావమరిది ఇమ్రాన్ అదే ఊరిలో ఓ దుకాణం నడుపుతున్నాడు. కాగా ఇదే గ్రామానికి చెందిన యువకులు హర్షవర్ధన్, అతడి తమ్ముడు విష్ణు, మరో యువకుడు అక్కడి అమ్మాయిలను వేదించడం..తగాదాలు పెట్టుకోవడం చేస్తున్నారు.
ఈ విషయంలో ఇమ్రాన్ వారిని గట్టిగా మందలించాడు. దాంతో ఇమ్రాన్ పై కక్ష్య పెంచుకున్నారు ఆ యువకులు. మంగళవారం ఆ యువకులు ఫుల్ గా మద్యం సేవించి ఇమ్రాన్ పై రాళ్లతో దాడి చేశారు..దీంతో ఇమ్రాన్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఇమ్రాన్ బావమరిది సత్తార్ ఆ యువకుల వద్దకు వెళ్లి ఎందుకిలా చేశారని ప్రశ్నించడంతో మద్యం మత్తులో ఉన్న వారు కత్తితో సత్తార్ పై దాడి చేశారు.
దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సత్తార్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.