రాజకీయంపై ఆసక్తి లేనివాళ్లు ఎవరు చెప్పండి. జీవితంలో ఆయన పొలిటికల్ లీడర్ అని అనిపించుకోవాలని చాలా మందికే ఉంటుంది. ఇక, కాస్త డబ్బు.. సమాజంలో పలుకుబడి ఉన్న వారికైతే.. చెప్పాల్సిన పనేముంది.. పాలిటిక్స్లో వారు చక్రం తిప్పకుండా ఉండలేరు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు లెక్కకు మిక్కిలిగానే పాలిటిక్స్లో చేరుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. తెలుగు నాట అన్నగారు ఎన్టీఆర్తో మొదలైన ఈ దిగ్విజయ యాత్ర ఇప్పుడు అనేక మంది సినీ రంగ ప్రముఖులను పాలిటిక్స్లో యాక్టివ్ చేసింది. అటుతెలంగాణ కానివ్వండి, ఇటు ఏపీ కానివ్వండి.. సినీ ప్రముఖులకు రాజకీయాలు ఎప్పుడూ ఎర్రతివాచీ పరుస్తూనే ఉంటాయి.
తెలంగాణలో హాస్యనటుడు బాబూ మోహన్ ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక, ఇప్పుడు తాజా బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు కూడా త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. మరో అడుగు ముందుకేసిన మీడియా రంగం 2019లో ఆయన ఎంపీగా కూడా పోటీ చేయనున్నారని వెల్లడించింది. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోనున్న దిల్ రాజుకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నుంచి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, దీంతో రాజు కోరుకున్న సీటును కేసీఆర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.
దిల్ రాజు ఇటీవల ఫిదా సినిమా తీసి హిట్ కొట్టారు. సాధారణంగా సినిమాలు చూసే తీరిక లేని కేసీఆర్ ఫిదా సినిమా చూసి ఫిదా అయిపోయారట. తెలంగాణ సంస్కృతిపై దిల్ రాజుకు ఉన్న అభిమానాన్ని మెచ్చుకున్న ఆయన రాజును పాలిటిక్స్లోకి ఆహ్వానించడంతో పాటు ఎంపీ సీటు కూడా ఆఫర్ చేసినట్టు టీఆర్ఎస్ వర్గాల ద్వారా వార్తలు వస్తున్నాయి. ఇక, రాజు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అనే విషయంపైనా క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం కేసీఆర్ తనయ కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ ఎంపీ సీటును రాజుకు కేటాయిస్తారని చెబుతున్నారు.
నిజామాబాద్ నియోజకవర్గం టీఆర్ ఎస్కి కంచుకోటగా ఉండడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు. కవితే వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఒక వేళ తిరిగి ఆమె ఇక్కడ నుంచే పోటీ చేస్తే అప్పుడు నిజమాబాద్ ఓకే కాకపోతే.. జహీరాబాద్ నుంచి అయినా రాజును నిలబెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం. అ క్రమంలో ఆమె నిజమాబాద్ సీటును ఖాళీ చేస్తే.. దానిని రాజుకు కేటాయించే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
అయితే ఇదే సీటుపై కవిత ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్రెడ్డికి కూడా మాట ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు అటు కేసీఆర్ రాజుకు, ఇటు కవిత సునీల్రెడ్డికి మాట ఇవ్వడమే నిజమైతే నిజామాబాద్ ఎంపీ సీటు కోసం ఆసక్తికరమైన వార్ స్టార్ట్ అయినట్టే.