నంద్యాల ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎవరి మధ్యన అంటే.. టీడీపీ, వైసీపీ అని ఎవరైనా చెబుతారు! మరి కాంగ్రెస్ ఎందుకు అభ్యర్థిని నిలబెట్టింది? కాంగ్రెస్ ఒకటి ఉందని ఓటర్లు, ప్రజలు గుర్తించే పరిస్థితి లేని సమయంలో.. నంద్యాల బరిలో మేమూ ఉన్నామని అభ్యర్థిని ఎందుకు రంగంలోకి దించింది? అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టడం వెనుకపెద్ద తతంగమే నడిచినట్టు తెలస్తోంది. వైసీపీని దెబ్బకొట్టేందుకు, కాంగ్రెస్కు వచ్చే కొన్ని ఓట్లయినా మేలని భావించిన ప్రభుత్వ పెద్దలు.. వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ కథ మొత్తం నడిపించారట.
రాష్ట్ర విభజన కాంగ్రెస్కు పీడకలలా మారిపోయింది. అసలు ఆ పార్టీని క్షమించే పరిస్థితిలో కూడా లేరు ఏపీ ప్రజలు! ఎన్నికలు జరిగి మూడేళ్లవుతున్నా.. ఇప్పటికీ ప్రజల్లో ఆ అభిప్రాయం మారలేదు. ఇటువంటి సమయంలో.. మేమూ ఉన్నాం అని గుర్తుచేసే ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ మొదలుపెట్టింది. నవ్యాంధ్రలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడంతో.. ఉనికి చాటుకునేందుకు బరిలోకి దిగింది. అంతేగాక నంద్యాలలో కీలకంగా ఉన్న ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు అబ్దుల్ ఖాదర్ను అతి కష్టం మీద వెతికి వెతికి పట్టుకుని నిలబెట్టింది. రాష్ట్ర విభజన దెబ్బకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా వైసీపీకి వెళ్లిపోయింది. టీడీపీకి ఓటువేయలేని వారాంతా వైసీపీకే ఓటువేస్తారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 2400 పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ ఓట్లు కొంత పెరగొచ్చు. అంటే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చే మూడు నుంచి నాలుగు వేల ఓట్లు సహజంగా వైసీపీకి వెళ్లాల్సినవే. ఆ ఓట్లు వైసీపీకి వెళ్లకుండా ఉండాలంటే కాంగ్రెస్ బరిలో దిగాలనేది పెద్దల వ్యూహం. నంద్యాలలో ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో ఉండేలా చూసేందుకు ఓ సీనియర్ మంత్రి.. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రంగంలోకి దిగి కథ నడిపించిన వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల డైరక్షన్ ప్రకారమే అంతా సాగింది. అంటే నేరుగా వైసీపీ అభ్యర్థికి దక్కాల్సిన ఓట్లకు చెక్ పెట్టినట్లు అయిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సీనియర్ మంత్రితో పాటు ఐఏఎస్ అధికారి కొంత మంది కాంగ్రెస్ పెద్దలతో ఈ వ్యవహారం నడిపినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ఎన్ని ఓట్లు తగ్గినా అది టీడీపీకి ప్లస్ తప్ప మైనస్ కాదు కదా!! ఇదే ఇక్కడ కీ ఫ్యాక్టర్! అందుకే బద్ద శత్రువైనా సరే కాంగ్రెస్ ను రంగంలోకి దించేశారు. మరి నంద్యాలలో కాంగ్రెస్-టీడీపీ వ్యూహం ఫలిస్తుందో లేదో వేచిచూడాల్సిందే!!