వైసీపీ అధినేత వైఎస్.జగన్కు వరుస కష్టాలు తప్పేలా లేవు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి ప్రధాన ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన జగన్ ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ వ్యతిరేకతను, వైపల్యాలను ఉపయోగించుకుని బలోపేతం అవ్వాల్సింది పోయి మరింత బలహీనం అయ్యాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ మూడేళ్ల కాలంలో జగన్ తీరుతో విసిగిపోయో లేదా వైసీపీలో ఉంటే తమకు ఫ్యూచర్ లేదనో డిసైడ్ అయిన వాళ్లు టీడీపీ గూటికి చేరిపోయారు.
మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలామంది టీడీపీ గూటికి చేరిపోయారు. ఇక నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని జగన్తో పాటు ఆ పార్టీ నాయకులు చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు. నంద్యాలలో టీడీపీ ఏకంగా 27 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడంతో వైసీపీ వాళ్లకు కాస్తో కూస్తో ఉన్న నమ్మకాలు కూడా పూర్తిగా సన్నగిల్లిపోయాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు మరింత మంది ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రెడీ అవుతోన్నట్టు సోషల్ మీడియాలో ఒక్కటే ప్రచారం జరుగుతోంది. మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరేందుకు ఓ హోటల్లో సీక్రెట్గా మీట్ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. వీరి పేర్లు కూడా బయటకు వచ్చేశాయి.
చిన్ననాటి స్నేహితుడే షాక్ ఇస్తాడా..!
ఈ జంపింగ్ లిస్టులో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత జగన్కు చిన్ననాటి స్నేహితుడు, అత్యంత ఆప్తుడు అయిన కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి నేతృత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్కు అత్యంత ఆప్తుడైన ఆయన జగన్ తీరుతో బాగా విసిగిపోయినట్టు తెలుస్తోంది. కొన్ని విషయాల్లో జగన్ చేసిన తప్పులను సరిచేసుకోవాలని ఆయన చెపుతున్నా జగన్ పట్టించుకోకపోవడంతో శ్రీకాంత్ తీవ్ర మనస్థాపానికి గురైనట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
త్వరలోనే హంద్రీనీవా, గాలేరు , నగరి, గండికోట ప్రాజెక్టులు పూర్తి కావస్తుండటంతో రాయచోటికి పుష్కలంగా నీరు రానుంది. రాయచోటి తీవ్రమైన నీటి ఎద్దడితో ఉంది. ఈ ప్రాజెక్టులన్ని పూర్తయితే రాయచోటి నీళ్లతో కళకళలాడడం ఖాయం. అదే జరిగితే రామచోటిలో శ్రీకాంత్రెడ్డికి రాజకీయంగా కష్టాలు తప్పవు. ఇక 2019లో అయినా జగన్ తీరు మారకపోతే అధికారం కష్టమే అన్న నిర్ణయానికి ఆయనతో పాటు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చేశారు.
ఈ క్రమంలోనే జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీని మరింత వీక్ చేసేందుకు టీడీపీ ఇప్పుడే వ్యూహానికి తెరలేపింది. జగన్కు రైట్ హ్యాండ్గా ఉంటోన్న శ్రీకాంత్రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ చేసిందని తెలుస్తోంది. అదే జిల్లాకు చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం.రమేష్ శ్రీకాంత్రెడ్డితో చర్చలు జరుపుతున్నారట. పార్టీలోకి వస్తే మంచి పదవి ఇస్తామని కూడా ఆయన ఆఫర్ పెట్టారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఏదేమైనా శ్రీకాంత్రెడ్డి త్వరలోనే షాకింగ్ డెసిషన్ తీసుకుంటారన్నదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో వినిపిస్తోన్న హాట్ టాపిక్.