`ఇప్పటికే పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి రహస్యం. తాళిబొట్టు కట్టే ముహూర్తం తేలగానే అందరికీ చెబుతాను. శుభలేఖలు అందరికీ ఇస్తా` అని సంచలన వ్యాఖ్యలు చేసి తర్వాత సైలెంట్ అయిపోయారు మాజీ సీఎం, జైసమైక్యాంధ్ర పార్టీ అధినేత నల్లారి కిరణ్కుమార్ రెడ్డి! ఏ పార్టీలో చేరాలనే విషయంలో ఆయన గందర గోళ పడుతున్నారట. కిరణ్కుమార్ సంగతి ఎలా ఉన్నా.. ఆయన సోదరుడు మాత్రం.. ఈ వెయిటింగ్ తట్టు కోలేకపోతు న్నాడట. అందుకే అన్న సంగతి పక్కనపెట్టి.. తన రాజకీయ భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకున్నా రట. ప్రస్తుతం టీడీపీలోకి వెళితే భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారట. ఇక త్వరలో సైకిల్ ఎక్కేయబోతున్నారని సమాచారం.
రాజకీయాలకు దూరంగా ఉండి సుమారు మూడున్నరేళ్లు అవుతున్నా.. సొంత నియోజకవర్గంలో పట్టు ఉన్నా.. ఏమీ చేయలేని పరిస్థితి నల్లారి కిరణ్కుమార్ సోదరుడు కిశోర్కుమార్ రెడ్డి. కష్టసుఖాల్లో అన్న వెన్నంటే నడిచిన ఆయన ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారట. ఏ పదవీ లేకుండా ఎంత కాలం ఇలా నెట్టుకురావాలన్న ఆలోచనలో పడ్డారట. అందుకే సైకిల్ ఎక్కేందుకు రెడీ అయిపోతున్నారు. నల్లారి కుటుంబానికి చిత్తూరు జిల్లా పీలేరులో గట్టి పట్టుంది. నల్లారి అమర్ నాథ్రెడ్డి నుంచి ఆ నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటూ వస్తున్న కిరణ్ కుమార్ సోదరులు మూడేళ్లుగా పత్తా లేకుండా పోయారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం డైలమాలో ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇలా ఏళ్ల తరబడి ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్ ఉండదని భావించిన కిశోర్కుమార్ ఇటీవల తన ముఖ్య అనుచరులతో సమావేశమై చర్చించారు. పీలేరు నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరతారని ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ దీన్ని చింతల ఖండించారు. దీంతో కిశోర్ కుమార్ రెడ్డి సైకిలెక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలిచి జోష్ మీద ఉన్న టీడీపీలోకి వెళితే బాగుంటుందని భావిస్తున్నారట.
పీలేరులో గత ఎన్నికల్లో అన్న స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసిన నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి స్వల్ప ఓట్లతోనే ఓటమి పాలయ్యారు. అక్కడ తమ బలం పెంచుకునేందుకు నల్లారి అవసరం ఉందని టీడీపీ కూడా భావిస్తోంది. వైసీపీలోకి వెళ్లాలన్నా అక్కడ తమ శత్రువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఇక బీజేపీలోకి వెళితే ముస్లింలలో వ్యతిరేకత వస్తుంది. దీంతో ఇక టీడీపీనే బెటర్ అని ఫిక్సయ్యారట. ఇప్పటికే మంత్రి అమర్ నాథ్రెడ్డి కూడా కిశోర్ కుమార్ రెడ్డితో చర్చించారట. అయితే పార్టీలో చేరేముందు సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించాలని నిర్ణయించుకు న్నారట. మొత్తానికి కిరణ్కుమార్ రెడ్డి సోదరుడు సైకిలెక్కడం ఖాయమైంది. ఇక ఆయన బాటలోనే అన్న కూడా నడుస్తారేమో చూద్దాం!!