ఆంధ్రప్రదేశ్ లో ఆ మద్య కాల్ మనీ వ్యవహారం ఎన్నో సంచలనాలకు తెరలేపింది. కాల్ మనీ దందా చేసే వారు తమను మానసికంగా, శారీరకంగా కృంగదీశారని అప్పట్లో ఎంతో మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు ఏపీ అసెంబ్లీలో కూడా ఈ వ్యవహారంపై పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతీరెడ్డికి, సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తికి కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
కాల్ మనీపై అప్పట్లో ప్రతి పక్ష పార్టీ సభ్యులు కూడా తీవ్ర విమర్శలు చేశారు. అధికార పార్టీ కి చెందిన బడా బాబులు, నాయకులు కాల్ మనీ దందా చేసే వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కాల్మనీ కేసులో తనపై అసత్యవార్తలు రాసారంటూ కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు సాక్షి దినపత్రికపై నూజివీడు కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
కాగా, ఈ కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో సాక్షి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ అయిన భారతీరెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తికి నాన్ బెయిలబుల్ వారెంట్ను కోర్టు జారీ చేసింది.