కొడుకుల కోసం కష్టపడిన, పడుతున్న నేతలను రాజకీయాల్లో మనం తరచు చూస్తుంటాం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీలో అయితే సోనియా గాంధీలు. రాహుల్ను ప్రధాని పీఠం ఎక్కించేందుకు ఆమె పడుతున్న ప్రయాస అంతా ఇంతా కాదు. ఇక, ఏపీలో బాబు తన కొడుకు లోకేష్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎన్ని తిప్పలు పడ్డారో తెలిసిందే. ఈ క్రమంలోనే కొడుకుల కోసం కష్టపడుతున్నవారు ఎందరో ఉన్నారు. అయితే, తాజాగా తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ను కాదని, కూతురుకోసం అష్ట కష్టాలు పడుతున్నారు.
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. కార్మిక సంఘాలు నేతలకు పదవులు కట్టబెట్టడం కొత్తకాదు. తమకు ఎప్పుడు ఏ సమస్య వస్తుందోనని సంఘాల నేతలు పొలిటికల్గా టచ్లో ఉండడం కోసం నేతలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ క్రమంలోనే కవితను నియమించుకున్నారు. అయితే, ఇప్పుడు కవితకు ఓ అగ్ని పరీక్ష ప్రారంభమైంది. ప్రస్తుతం సింగరేణి ఎన్నికల వేడి రాజుకుంది. దీంతో కవిత వర్గం(సంఘం) గెలిచి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీఆర్ ఎస్ నేతలు ముఖ్యంగా సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
తన కుమార్తె ప్రతిష్ట నిలబెట్టడానికి.. ప్రస్తుతం జరుగుతున్న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ కు మళ్లీ విజయం దక్కేలా చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. నానా తిప్పలు పడుతున్నారు. నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ఇదే సంఘం సింగరేణిలో విజయం సాధించింది. అయితే, అప్పట్లో అది గొప్ప విషయం కాదు. తెలంగాణ ఉద్యమ సెగలు పొగలు కక్కుతున్న నేపథ్యంలో ఈ సంఘం గెలుపు బావుటా ఎగరేసింది. అయితే ఇప్పుడు పరస్థితి వేరు. రాష్ట్రం అనే స్వప్నం సాకారం అయింది. కేసీఆర్ పాలన మొదలై మూడున్నరేళ్లు కూడా గడిచాయి.
దీంతో 52 వేల మందికి పైగా కార్మికులు ఓట్లు వేసే ఇలాంటి ఎన్నికల్లో కేసీఆర్పై ఉన్న అభిప్రాయాలు స్పష్టంగా బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిందంటే.. తమ ప్రభుత్వం తెలంగాణలో ఇబ్బందుల్లో పడినట్టేనని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో అటు కూతురు గెలుపు కోసం, ఇటు పార్టీ భవిష్యత్తు కోసం .. కూడా కేసీఆర్ శాయశక్తులా కృషి చేస్తున్నట్టు సమాచారం. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డ, జాగృతి అధ్యక్షురాలి గెలుపే ధ్యేయంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.