నాకు అన్నీ తెలుసు! సమయం చూసుకుని స్పందిస్తా! అంటూ తరచూ పార్టీ నేతలను హెచ్చరించే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. ఖచ్చితంగా సమయం చూసుకుని స్పందిస్తే.. ఏమవుతుందో ఇప్పుడు ప్రకాశం నేత కరణం బలరాంకి బాగా తెలిసొచ్చింది! నిన్న మొన్నటి వరకు భారీ ఎత్తున కాలర్ ఎగరేసి.. కాలు దువ్విన కరణం.. బాబు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా కొట్టుకులాడుతున్నాడట. విషయంలోకి వెళ్తే.. కరణం బలరాం గత ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీ సీనియర్ నేతగా కూడా చక్రం తిప్పారు.
అయితే, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబు వైసీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి పచ్చకండువా కప్పి సైకిల్ ఎక్కించుకున్నారు. దీంతో జిల్లాలో తన హవాకు గండి పడుతుందని, తనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతుందని భావించిన కరణం.. గొట్టిపాటిపై ఓ రేంజ్లో చెలరేగిపోయారు. వీధి పోరాటాలకు దిగారు. దీంతో ఈ విషయంలో చంద్రబాబు.. బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. నేతలు హద్దు దాటితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
కరణంకు బాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. అద్దంకి నియోజకవర్గంలో వేలుపెట్టవద్దని కూడా ఆయనకు సూచించారు. అయినా కరణం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చీటికీ మాటికీ గొట్టిపాటితో ఆధిపత్య ధోరణిని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఇక, విసిగిపోయిన చంద్రబాబు ఇటీవల పార్టీ పదవుల్లో కొందరిని నియమించారు. ఈ నేపథ్యంలో సీనియర్లకు పెద్ద పీట వేశారు. అయితే, ఈ నియామకాల్లో పార్టీ రాష్ట్ర కమిటీలో సీనియర్లకు స్థానం కల్పించినా.. కరణం బలరాంకి చోటు కల్పించలేదు. కనీసం పేరును కూడా పరిగణనలోకి తీసుకోలేదు.
దీంతో కరణానికి విషయం తెలిసొచ్చింది. తన హద్దులు, తన పరిస్థితి ఏంటో అర్ధమైందట. ప్రస్తుతం పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలోనూ గొడవ చేయకుండా పాల్గొంటున్నారని జిల్లా పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ పరిణామం స్థానికంగా చర్చకు దారితీసింది. దీనిని బట్టి తోకజాడిస్తే ఎలాంటి నేతకు అయినా తోక కట్ చేసి పడేస్తానని బాబు వార్నింగ్లు ఇస్తున్నారన్న చర్చలు టీడీపీలో నడుస్తున్నాయి.