సింగరేణి ఎన్నికల్లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఘనవిజయం సాధించినా రెండు చోట్ల మాత్రం ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో అన్ని చోట్లా విజయం సాధించాలని కేసీఆర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 11 డివిజన్లలో ఎన్నికలు జరిగితే ఇందులో 9 డివిజన్లలో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ విజయం సాధించగా, రెండింటిలో ఏఐటీయూసీ గెలుపొందింది. ఆ రెండు డివిజన్లలో ఓటమికి గల కారణాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పోస్ట్ మార్టం నిర్వహించారు.
ఈ పోస్టుమార్టంలో స్థానికంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతోనే ఆ రెండు చోట్ల పార్టీ అనుబంధ విభాగం ఓడిపోయిందన్న నివేదిక కేసీఆర్ వద్దకు చేరిపోయింది. దీంతో అగ్గిమీద గుగ్గిలం అవుతోన్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సదరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరికి టిక్కెట్లు కట్ చేసేయాలని డిసైడ్ అయిపోయారట. ఇప్పుడు టీఆర్ఎస్ రాజకీయవర్గాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్గా మారింది. చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలుపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో మందమర్రి డివిజన్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘం ఓడిపోయింది.
ఇక్కడ ఓదేలుపై జనాల్లో వ్యతిరేకత ఉండడం ఓ కారణం అయితే, దీనికి తోడు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎంపీ వివేక్ ఇద్దరూ కలిసి ఆయనకు యాంటీగా పనిచేయడం కూడా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఓడిపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇక తనపై కుట్ర జరిగిందని ఓదేలు కేసీఆర్కు వివరించే ప్రయత్నం చేసినా ఇంటిలిజెన్స్ రిపోర్టు తర్వాత కేసీఆర్ ఓదేలు మాటలను విశ్వసించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే మూడుసార్లు గెలిచిన ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. ఓదేలును ఎమ్మెల్సీగా పంపాలని కేసీఆర్ భావిస్తున్నారట.
ఇక కొత్త జిల్లాగా ఏర్పడిన భూపాలపల్లి నియోజకవర్గానికి తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన స్పీకర్గా ఉండడంతో ఇక్కడ ఆయన కుమారులు ప్రచారం చేశారు. అయినా పార్టీ అనుబంధ సంఘం ఘోరంగా ఓడిపోయింది. మధుసూదనా చారి కుమారుల వ్యవహారంతో ఆయనపై కూడా వ్యతిరేకత స్టార్ట్ అయ్యిందన్న నివేదికలు కేసీఆర్కు చేరడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన్ను తప్పించి ఆయన్ను పెద్దలసభకు పంపాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఏదేమైనా సింగరేణి ఎన్నికలు తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లకు ఎసరు పెట్టేశాయి. ఇక వీరిద్దరే కాదు.. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న ముగ్గురు మంత్రులతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను కూడా వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేయాలని కేసీఆర్ డిసైడ్ అయిపోయారట. మరి ఈ లిస్టులో ఉన్నవాళ్లు ఇప్పటికి అయినా జాగ్రత్తలు పడతారేమో ? చూడాలి.