ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో చారిత్రక ఘట్టానికి సాక్షీభూతంగా నిలవబోతోంది. పూర్తిగా రూపుదిద్దుకోకముందే ఇప్పటికే ఎన్నో కీలక ఘట్టాలు ఆవిష్కరించుకున్న ఈ నగరం ఇప్పుడు మహిళాభ్యుదిశం దిశగా ఓ గొప్ప ముందడుగు వేయబోతోంది. ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచేలా మహిళల కోసం అమరావతి డిక్లరేషన్ ప్రకటిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన మహిళా పార్లమెంటు సదస్సు ద్వారా చర్చించిన అంశాలపై ఒక డిక్లరేషన్ ను ప్రభుత్వం రూపొందించింది.
ఏపీ సర్కారు నిర్వహిస్తున్న అమరావతి డిక్లరేషన్- మహిళా సాధికారత సదస్సు మహిళాభివృద్ధికి ఏ మార్గసూచి కానుంది. విజయవాడలోని సిద్దార్థ ఆర్ట్స్ కళాశాల మైదానం ఈ అమరావతి డిక్లరేషన్ కు వేదిక. మహిళా పార్లమెంటు నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు డిక్లరేషన్ సదస్సును పర్యవేక్షిస్తున్నారు.
ఫిబ్రవరిలో జరిగిన మహిళా పార్లమెంట్లో చర్చించిన అంశాల ఆధారంగా అమరావతి డిక్లరేషన్ రూపొందించారు. ప్రపంచంలో ప్రతి మహిళా ఎదుర్కొనే 10 సమస్యలకు డిక్లరేషన్ లో చోటు కల్పించారు.
మహిళా సమస్యలపై పరిష్కారానికి ఈ డిక్లరేషన్ ఒక ప్రాతిపదికగా భావిస్తున్నారు. ఈ డిక్లరేషన్ ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చట్టాలకు సిఫారసు చేస్తారు. అమరావతి డిక్లరేషన్ ద్వారా మహిళా ప్రగతికి విలువైన సూచనలు అందించే దిశగా ఈ సదస్సు నిలుస్తుంది. అమరావతి డిక్లరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి, ఎస్ బీఐ పూర్వ ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య, అడయార్ కేన్సర్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ శాంత హాజరవుతారు.
ఆంధ్రప్రదేశ్ లో మహిళా అభ్యున్నతి కోసం పాటు పడుతూ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈ సదస్సులో పాల్గొననున్నారు. వివిధ రంగాలకు చెందిన రెండు వేల మంది మహిళా ప్రతినిధులను ఈ సభకు ఆహ్వానించారు.