తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ సీతయ్య. తాను అనుకున్నది చేసేందుకు ఆయన ఎవ్వరి మాట వినరు. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేసేస్తాడు. అవతల ఉన్నది ఎవరైనా కేసీఆర్ పట్టించుకోరు. మూడున్నరేళ్ల పాలనలో ఆయన పాలన తీరుపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన దూకుడు మాత్రం ఆగడం లేదు. అప్పుడే ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేసేసిన కేసీఆర్ కులాల వారీగా ఓట్లు కొల్లగొట్టేందుకు కొత్త ప్లానింగ్కు తెరదీశారు.
ఇక కేసీఆర్ సీఎం అవ్వకముందు, అయ్యాక ఎన్నో హామీలు ఇచ్చారు... ఇంకా ఇస్తూ ఉంటారు. అయితే వాటిని నెరవేర్చకపోవడంలోనూ కేసీఆర్ అంతే చతురత ప్రదర్శిస్తాను. తెలంగాణ వచ్చిన వెంటనే ఓ దళితుడిని రాష్ట్రానికి సీఎంగా చేస్తానని చెప్పారు. ఆ హామీ ఏమైందో ఎవ్వరికి తెలియదు. ఇక కేసీఆర్ కేబినెట్లో మొత్తం తనతో కలుపుకుంటే 18 మంది మంత్రులు ఉన్నారు. మహిళలకు తానేంతో గౌరవం ఇస్తానని చెప్పే కేసీఆర్ తన కేబినెట్లో ఒక్క మహిళకు కూడా కేబినెట్లో చోటు ఇవ్వలేదు. ఈ విషయంలో కేసీఆర్పై ఎన్నో విమర్శలు వచ్చినా ఆయన మాత్రం లెక్క చేయలేదు.
మరో యేడాదికి కాస్త అటూ ఇటూగా ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. ఇలాంటి టైంలో కేసీఆర్ తన కేబినెట్ను మార్చే సాహస నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సడెన్గా తన కేబినెట్ను మార్చడం వెనక కారణం ఏంటా ? అని ఆలోచిస్తే ఇటీవల హైదరాబాద్కు వచ్చి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పరోక్ష కారణంగా కనిపిస్తోంది. ఇక్కడ జరిగిన జీఈఎస్ సదస్సుకు అదిరిపోయే ఏర్పాట్లు చేసిన కేసీఆర్ సర్కార్ ఓ విషయంలో మాత్రం ఇరుకున పడిపోయింది. ఈ మహిళా సదస్సుకు ప్రభుత్వం నుంచి ఒక్క మహిళా ప్రతినిధి కూడా లేకపోవడం. ఇవాంకా సహా మహిళా ప్రతినిధులతో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కూడా ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ సమన్వయకర్త పాత్ర పోషించారు.
తెలంగాణ కేబినెట్లో ఒక్క మహిళా మంత్రి లేకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాల విమర్శలకు గురవుతోంది. ఇటు విపక్షాలతో పాటు తెలంగాణలో న్యూట్రల్ పీపుల్స్, మహిళల నుంచి ఇబ్బందులు వస్తున్నాయి.ఈ విమర్శలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయిన కేసీఆర్ తన కేబినెట్లో ఓ మహిళా మంత్రికి ఛాన్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే యేడాది ఆరంభంలో జరిగే ఈ ప్రక్షాళనలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి లేదా విప్ గొంగిడి సునీతారెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి దక్కనుందని టాక్. వీరికి మంత్రి పదవి ఇచ్చే క్రమంలో ఓ రెడ్డి మంత్రిని పక్కన పెట్టక తప్పదు. ఇక ఎస్టీ కోటాలో అజ్మీరా చందూలాల్ను తప్పించి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పేరు పరిశీలనలో ఉన్నా ఈ మార్పు కష్టమే అని టీ పాలిటిక్స్లో చర్చ నడుస్తోంది.