తెలుగు యువత అధ్యక్షుడు ఎవరనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు చంద్రబాబు, లోకేష్. తెలుగు యువత అధ్యక్షని పదవీకాలం ముగిసినా పోటీ ఎక్కువుగా ఉండటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చివరిగా ప్రస్తుత ఎమ్మల్సీగా ఉన్న బీద రవిచంద్ర యాదవ్ తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగారు. సుమారు 8ఏళ్ల నుంచి తెలుగు యువత అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎవరూ ఆ పదవి తీసుకోవడానికి ఆసక్తి కనపబరచకపోగా ఇప్పుడు అధికారంలో ఉండే సరికి ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు.
యువతకు రాజకీయంగా అవకాశాలు, ఉద్యోగాలు.. ఇదీ టీడీపీ ఆవిర్భానికి ప్రధాన కారణాలు. పార్టీ వ్యవస్దాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు యువతకు అధిక ప్రాధాన్యమిచ్చారు. యువతను మంత్రులుగా తయారు చేశారు. అప్పట్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు, కృష్ణయాదవ్, శ్రీనివాస్ యాదవ్, ప్రస్తుతం మంత్రిగా ఉన్న అమర్ నాధ్ రెడ్డి గతంలో తెలుగు యువత అధ్యక్షులుగా పనిచేసిన వారే. నాడు ఎన్టీఆర్ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరావు తెలుగుయువత అధ్యక్షుడిగా పనిచేశారంటే ఆ పదవికి ఆయనిచ్చిన ప్రాధాన్యమేంటో అర్థం చేసుకోవచ్చు. 2004లో పార్టీ అధికారం కోల్పోయిన కోన్ని రోజులకు బీద రవిచంద్రను తెలుగుయువత అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు. అప్పట్లో గట్టిపోరాటాలు చేసి తెలుగు యువత పదవికి మంచి క్రేజ్ తీసుకువచ్చారు. ఆ కమిటీ పదవీకాలం ముగిసినా కొద్దిరోజుల ముందు వరకు యువత కార్యకలాపాలన్ని వారే నిర్వహించారు.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు దేవేందర్గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ను నియమించారు. ఏపీకి మాత్రం ఇంత వరకు తెలుగుయువత అధ్యక్షుడుని నియమించకుండానే నెట్టుకొస్తున్నారు చంద్రబాబు. 2014 ఎన్నికలకు ముందు అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ పేరు తెరపైకి వచ్చినప్పటికి ఆచరణలో అమలు కాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ పదవిని భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిలో భాగంగా అర్హులైన యువ నాయకుల కోసం సెర్చ్ మొదలు పెట్టారు చంద్రబాబు.
తెలుగుయువత కోసం కుల సమీకరణాలు బేరిజు వేసుకుంటున్నారు చంద్రబాబు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు బీసీ వర్గానికి చెందిన వారు కావడంతో తెలుగు యువతను ఓసీకి చెందిన నాయకుడికి ఇవ్వాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఈ పదవి కోసం పార్టీలో తీవ్రమైన పోటి ఉంది. ప్రధానంగా రేసులో మాజీ మంత్రి దేవినేని నెహ్రు తనయుడు దేవినేని అవినాష్ ముందున్నారు. అవినాష్ యాక్టివ్గా ఉన్న నేపధ్యంలో అవినాష్కు ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తుంది. మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ కూడా పదవి ఆశిస్తున్నారు. మంత్రి సోమిరడ్డి చంద్రమోహన్ రెడ్డి తనయుడు రాజగోపాల్ రెడ్డి నెల్లూరు లో యాక్టివ్గా తిరుగుతున్నారు. నియోజకవర్గ బాధ్యతలు సోమిరెడ్డి తనయుడు చూస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి తెలుగుయువత ఇస్తే ఇతని పేరు పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరో మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ కూడా తెలుగుయువత అధ్యక్షుడు రేసులో ఉన్నారు. మొన్నటివరకు గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన మన్నెం నాగమల్లేశ్వరావు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత టియన్యస్యఫ్ అధ్యక్షుడిగా ఉన్న నాదెండ్ల బ్రహం చౌదరి ఈసారి తెలుగుయువత అధ్యక్ష రేసులోకి వచ్చారు. వీరంతా మంత్రి లోకేష్ను కలిసి తెలుగుయువత బాధ్యతలు ఇవ్వాలని కోరారు. గతంలో ఒకసారి ఈ పదవిని శ్రీకాకుళం ఎంపిగా ఉన్న రామ్మోహన్ నాయుడుకి ఇవ్వాలనే ఆలోచన చేశారు. ఎంపీగా ఉంటూ తెలుగుయువత బాధ్యతలు చూడటం కొంత కష్టం అవుతుందని రామ్మోహన్ సున్నితంగా తిరస్కరించారు.
2019 ఎన్నికలకు సమయం సమిపిస్తుండటంతో ఎట్టి పరిస్దితుల్లో తెలుగుయువత అధ్యక్షుడిని వీలైనంత త్వరగా నియమించాలని బాబు భావిస్తున్నారు. అయితే పోటిలో అంతా కమ్మ సామాజికవర్గం వారే ఎక్కువుగా ఉండటంతో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆసక్తిగా మారింది..