తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఎన్నో రాజకీయ సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఇక ఆర్కేనగర్ లో ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నో ట్విస్టులు నెలకొన్నాయి. అప్పటి వరకు జయలలితకు సంబంధించిన ఎలాంటి వీడియో ఫుటేజ్ లూ బయటకు రాలేదు..కానీ ఎన్నికలకు రెండు రోజుల ముందు అమ్మకు సంబంధించిన ఓ వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో దుమ్మురేపింది. తాజాగా ఆర్కేనగర్ ఉప ఎన్నికకు ముందు బయటకు వచ్చిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వీడియోపై జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ వేసిన ప్రశ్నలకు శశికళ మేనకోడలు కృష్ణప్రియకు ముచ్చెమటలు పట్టాయి.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతిపై ఏర్పాటైన జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ ఎదుట అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ మేనకోడలు కృష్ణప్రియ హాజరయ్యారు. వందకుపైగా ప్రశ్నలు సంధించడంతో సమాధానాల కోసం తడబడ్డారు. జయలలిత మృతిపై అనుమానాలు రేకెత్తడంతో ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వం జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ను నియమించింది. జయ వీడియోను తీసింది ఎవరు? శశికళ తీశారా?.. లేక మరెవరైనా తీశారా? ఎన్ని వీడియోలు తీశారు? అన్న ప్రశ్నలకు కృష్ణ ప్రియ నుంచి సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది.
ఆమె ఇచ్చిన సమాధానాలను వాంగ్మూలంగా నమోదు చేసుకుని సంతకాలు కూడా తీసుకున్నారు. కాగా, జయలలిత చికిత్సకు సంబంధించిన వివరాలు, ఆమె ఆసుపత్రిలో చికత్స పొందుతుండగా తీసిన వీడియోలున్న పెన్డ్రైవ్ను అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకుడు దినకరన్ తరఫు న్యాయవాది విచారణ సంఘానికి సమర్పించారు.
ఇదిలావుంటే, తన అడుగులకు మడుగులొత్తని రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐటీ, సీబీఐ చేత దాడులు జరిపిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకుడు టీటీవీ దినకరన్ ధ్వజమెత్తారు.