తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ. ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి షభాష్ అనిపించుకున్నారు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించిన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు బాలకృష్ణ. అంతే కాదు తండ్రి బాటలోనే నడుస్తూ..రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు. హిందూపురం ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
గత కొంత కాలంగా ఫ్యాక్షన్ తరహా చిత్రాల్లో నటిస్తున్న బాలయ్య గత సంవత్సరం క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రాత్మక చిత్రంలో నటించి మెప్పించారు. వెంటనే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫుల్ మాస్ గా ‘పైసా వసూల్’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ‘జై సింహ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్టు మాస్, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ కలగలిపి ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
తాజాగా బాలకృష్ణ పెనుగొండలోని మడకశిర కూడలి వద్ద ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాడు పెనుగొండ ఏరియాలో అరాచక శక్తులు రాజ్యమేలుతుండగా తెలుగుదేశం పార్టీ పరిటాల రవిని రంగంలోకి దింపి ఆటకట్టించిదని..ఎన్టీఆర్ అంటే పరిటాల రవికి ఎంతో అభిమానం అన్నారు.
అదే విధంగా తన తండ్రి కూడా ఆయన పట్ల ఎంతో విశ్వాసంతో ఉండే వారని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఎన్టీ రామారావు విగ్రహాన్ని నేనే ఆవిష్కరించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. రాయలసీమలో పలు పరిశ్రమలు నెలకొల్పడంలో సీఎం చంద్రబాబునాయుడు విశేష కృషి చేస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.