ఏపీ సీఎం అంటే చాలా స్ట్రిక్ట్. ఆయన కేబినెట్ ఆయన కనుసన్నల్లోనే నడుస్తుంది. ఇంచ్ కూడా బాబు మాటను జవదాటదు- ఈ మాటలకు కాలం చెల్లిందా? బాబు ఆదేశాలను, ఆజ్ఞలను కొందరు మంత్రులు బేఖాతరు చేస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను- అని పదే పదే చెప్పే చంద్రబాబు కేబినెట్లో ఇద్దరు మంత్రులు మాత్రం సీఎం బాబును పక్కన పెట్టి మరీ గాఢ నిద్ర పోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. ఎక్సైజ్ మంత్రి జవహర్, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డిలు తమ దారిలో తాము వెళ్తున్నారు తప్ప సీఎం చంద్రబాబు ఏం చెబుతున్నారు? ఏం చేయమంటున్నారు? అన్న విషయాలను కనీసం మాట మాత్రంగానైనా పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మంత్రి జవహర్ను పలుసార్లు హెచ్చరించినా.. మందలించినా.. ఫైళ్ల పరిష్కారంలో జాప్యం చేస్తున్నారు. ఇక, మంత్రి ఆదినారాయణరెడ్డి నిర్వహిస్తున్నశాఖల ఫైళ్ల పరిష్కారంలో ఆయన కుమారుడితో పాటు మరో ముఖ్యవ్యక్తి ప్రమేయం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మంత్రి కుమారుడు పేషీలో కీలకంగా మారుతున్నాడని, ఆయనను కలవనదే ఏ ఫైలూ పరిష్కారం కావడం లేదని అధికారులు చెప్పుకుంటున్నారంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రతి ఫైల్కు ఏదో లాభం ఉండాలని ఆశిస్తూ.. జవహర్, ఆదినారాయణరెడ్డిలు వ్యవహరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులే చెప్పుకోవడం గమనార్హం.
ఇప్పటికే అనేకసార్లు బాహాటంగా వివరాలు బయటపెట్టినా.. పిలిచి హెచ్చరించి మందలించినా.. ఆ ఇద్దరు మంత్రులు ఫైళ్ల పరిష్కారంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని అమరావతిలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న క్రమంలో ఫైళ్ల పరిష్కారంతో ఆర్థిక నిధులు సమకూర్చుకునేందుకు వీరు ప్రయత్నిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కొందరు మంత్రులు తాము లిఖిత పూర్వకంగా సిఫార్సులు చేస్తే... లక్షలు చేతులు మారుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, ఈ విధమైన తెలివితేటలు కల మంత్రిని గతంలో తాము చూడలేదని అంటున్నారంటే జవహర్ వ్యవహారం ఏ రేంజ్లో ఉందో అర్ధమవుతోంది.
ఇక, మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా తక్కువేమీ తినలేదని, ఫైళ్ల పరిష్కారంలో బాగానే కట్టలు కొట్టేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా మంత్రి ఫైళ్ల పరిష్కారాన్ని తన కుమారుడికే అప్పచెప్పారనే విమర్శ అటు జిల్లాలోనూ..ఇటు శాఖ అధికారుల్లోనూ వినిపిస్తోంది. ఈ ఇద్దరు మంత్రుల విషయం బయటకు పొక్కడంతో.. ముఖ్యమంత్రి వీరిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.