ఏపీలో రాజకీయ కేంద్ర బిందువు అయిన విజయవాడలో కొద్ది రోజులుగా దివంగత మాజీ నేత వంగవీటి మోహనరంగ తనయుడు వంగవీటి రాధా రాజకీయంగా ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీలో జగన్ వద్ద రోజు రోజుకు రాధా ప్రాధాన్యత తగ్గడంతో ఆయన త్వరలోనే టీడీపీలో చేరిపోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. రాధా టీడీపీ ఎంట్రీ వార్తలు రావడంతో జగన్ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యి ఆయన వద్దకు ఏకంగా కొందరు దూతలను కూడా పంపారు. స్థానికంగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథితో పాటు మరికొందరు వెళ్లి రాధాను బుజ్జగించారు. పార్టీలో నీకు అన్యాయం జరగదని చెప్పినా ఆయన కోరుకున్న సెంట్రల్ సీటు విషయంలో మాత్రం వారు హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.
రాధాకు వచ్చే ఎన్నికల్లో గెలుపు కీలకం. ఇప్పటికే రెండుసార్లు వరుసగా ఓడిపోయి ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే అది రాజకీయంగా రాధా కెరీర్కు శుభం కార్డు పడినట్టే అవుతుంది. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన రాధా ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో గెలిచి తన పొలిటికల్ స్టామినా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే రాధా కోరుకుంటోన్న సెంట్రల్ సీటునే మరో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా కోరుతున్నారు. అక్కడే విష్ణు సామాజికవర్గానికి చెందిన 40 వేల మంది బ్రాహ్మణ వర్గం ఓటర్లు ఉన్నారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ సెంట్రల్ సీటు విష్ణుకే ఇచ్చి రాధాకు పార్టీలో కీలక పదవి ఇవ్వడంతో పాటు ఏ ఎమ్మెల్సీనో ఇచ్చేసి సరిపెట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా రాధాకు పార్టీ నుంచి లీకులు వచ్చాయి. దీంతో రాధా వైసీపీలో సంతృప్తితో అయితే లేదనే తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో ఇప్పటికే కాపులను తన వైపునకు తిప్పుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయిన సీఎం చంద్రబాబు ఇప్పుడు రాధాను కూడా తమ పార్టీలోకి లాగేసుకుంటే దక్షిణ కోస్తాలో బలమైన కాపు సామాజికవర్గాన్ని మొత్తం టీడీపీ వైపునకు తిప్పుకున్నట్టే అవుతుందని ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొందరు టీడీపీ కాపు నేతల ద్వారా రాధాకు పార్టీలో చేరమని వరత్మానం కూడా పంపినట్టు తెలుస్తోంది. విజయవాడలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా రాధా ఒప్పుకుంటే మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి ఆయన్ని పోటీ చేయించడానికి రెడీ అంటోందట టీడీపీ. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాధాకు ఎక్కడో ఓ చోట నుంచి అసెంబ్లీ సీటు ఇచ్చేలా...లేని పక్షంలో కాపులు బలంగా ఉన్న మచిలీపట్నం నుంచి ఆయన్ను ఎంపీ బరిలోకి దించాలన్నదే టీడీపీ ప్లాన్. అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణను వచ్చే ఎన్నికల్లో పెడన నుంచి అసెంబ్లీ బరిలోకి దించి అక్కడ నుంచి రాధాను పోటీ చేయించాలని కూడా టీడీపీ చూస్తోంది. ఏదేమైనా రాధా పార్టీలోకి వచ్చి, ఆయనకు ఎంపీ సీటు ఇస్తే కాపుల్లో టీడీపీకి మరింత బలం వస్తుందన్నదే ఆ పార్టీ, చంద్రబాబు ప్లాన్.