తెలంగాణ కుంభమేళా… వన దేవతల జన జాతర.. మేడారం సమ్మక్క, సారక్క జాతరకు.. భక్త జన ప్రవాహం తరులుతోంది. సమ్మక్క సారలమ్మ దర్శనానికి క్యూ కడుతున్నారు. అయితే ఈ జాతరకు హాజరయ్యేందుకు భక్తులు గత వారం నుంచి క్యూకట్టారు. దీంతో మేడారం దారులన్నీ కిటికిటలాడుతున్నాయి. జాతరకు అందుకోలేమనుకున్న భక్తులు ముందుగా దర్శించుకుంటున్నారని అధికారులు తెలిపారు. మేడారం జాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతం కానుంది. డప్పు దరువులు, శివసత్తుల పూనకాలుచ, తీన్మార్ స్టెప్పులతో మేడారం మార్మోగుతుంది.
ఇప్పటికే మేడారం భక్తజనం సంద్రంగా మారింది. ఇప్పటికే గతవారంలో 40లక్షలమందికి పైగా దర్శించుకున్నారని అంచనా. మూడురోజుల పాటు జరిగే ఈ జాతరకు కోటిమందికి పైగా భక్తులు వనదేవతల్ని దర్శించుకుంటున్నారని సమాచారం. బెల్లాన్ని బంగారంగా సమర్చింది మొక్కులు తీర్చుకుంటున్నారు. గద్దె మీద సారలమ్మను ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కన్నెపల్లి నుంచి సారక్కను తీసుకువచ్చేందుకు అంతా రెడీ చేశారు. ప్రత్యేక పూజల తర్వాత.. అమ్మవారిని వెంట తీసుకుని మేడారం బయల్దేరనున్నారు. ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో మేడారంలోని గద్దెపై సారక్కను ప్రతిష్టిస్తారు.
సమ్మక్క - సారలమ్మ జాతర విశిష్టత :
జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా మనదేశంలోనే వనదేవతులుగా సమ్మక్క-సారక్క లు పూజలందుకుంటున్నారు.
ఎవరీ సమ్మక్క- సారలమ్మ?
సమ్మక్క- సారలమ్మ ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. 12వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఉన్న 'పొలవాస' ను పరిపాలించే గిరిజన దొర మేడరాజు. అయితే తన ఏకైక కుమార్తె సమ్మక్కను మేనల్లుడైన మేడారంను పాలించే పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేస్తారు. ఈ పుణ్య దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము కలిగారు.
కాకతీయల మొదటి ప్రభువు ప్రతాప రుద్రుడికి రాజ్య విస్తరణ చేయాలనే కోరిక అమితంగా ఉండేది. అందుకోసం తన సైన్యంతో ఇతర రాజ్యలపై దండెత్తి వాటిని స్వాధీనం చేసుకొని తన రాజ్యంలో కలుపుకుంటాడు. అలా రాజ్యవిస్తరణలో భాగంగా ప్రతాపరుద్రుడు గిరిజన దొర మేడరాజు పాలించే పొలవాసపై దండెత్తుతాడు. ఈ దండయాత్రలో ప్రతాపరుద్రుడి దాడితట్టుకోలేని మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసము గడుపుతుంటాడు.
అయితే మేడారాన్ని పాలించే కోయరాజు "పగిడిద్దరాజు" కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకలతో పన్నుచెల్లించలేకపోతాడు. రాజ్యం విస్తరణ కాంక్షలో ప్రతాపరుద్రుడు మేడారాన్ని దక్కించుకోవాలనే దురుద్దేశంతో పగిడిద్ద రాజుపై కుట్రపన్నుతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో తనకు వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడంటూ ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.
సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటము చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధములో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది.
ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యములోనే అద్రుశ్యమైనది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కాని ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.