వైద్యో నారాయణో హరి..అన్నారు పెద్దలు. భగవంతుడు మనిషిని సృష్టిస్తాడు..కానీ అతనికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా..వైద్యుడు తిరిగి జీవం పోస్తాడు..అందుకే వైద్యులను దైవంతో పోలుస్తారు. కానీ ఈ మద్య కొంతమంది వైద్యుల వల్ల ఆ వృత్తికి కలంకం వచ్చిపడుతుంది. సభ్యసమాజం తలదించుకునేలా కొంతమంది వైద్యులు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో 40మంది సామాన్య రోగులకు హెచ్ఐవీ సోకింది. ఉన్నావో జిల్లా పరిధిలోని బంగర్ మావ్ ప్రాంతంలో నడుస్తున్న ఓ క్లినిక్ లో ఇంజక్షన్లు చేసేందుకు ఒకటే సూదిని వాడుతూ ఉండటంతో కనీసం 40 మంది హెచ్ఐవీ బారినపడ్డారు. గత సంవత్సరం చివర్లో ఈ ప్రాంతంలో ఓ హెల్త్ క్యాంప్ నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ వెంటనే సదరు క్లినిక్కు వెళ్లిన అందరి రక్త నమూనాలను పరీక్షించాలని నిర్ణయించారు. 'దాదాపు 40 హెచ్ఐవీ కేసులు బయటకు వచ్చాయి. ప్రతీ ఒక్కరినీ పరీక్షిస్తే దాదాపు 500మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలవచ్చు. తమకున్న రోగాలను నయం చేసుకునేందుకు ఆస్పత్రికి వెళితే.. అక్కడి డాక్టర్ ఒకే సిరంజీని అందరికీ వాడటమే దీనికి కారణం' అని బంగార్ మావ్ సిటీ కౌన్సిల్ సునీల్ తెలిపారు.
ఇప్పటికే ఆసుపత్రి వైద్యుల లైసెన్స్ లను రద్దు చేశామని, విచారణ కొనసాగుతోందని, ఆసుపత్రికి వచ్చిన కొందరు ట్రక్ డ్రైవర్ల నుంచి వైరస్ వ్యాపించి ఉండవచ్చని ఆరోగ్య మంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.