డబ్బు సంపాదన కోసం మనుషులు ఎన్ని పనులైనా చేస్తారు, దేనికైనా తెగిస్తారు. కొంతమంది నిజాయితీగా తమ కష్టమును నమ్ముకొని సంపాదిస్తే, మరి కొంతమంది సులువుగా డబ్బు సంపాదించాలని, రాజభోగాలు అనుభవించాలని అడ్డదారులు తొక్కుతారు. ఇలా డబ్బు ఎక్కువగా సంపాదించాలనే ఆశతో తప్పుడు మార్గాలను ఎంచుకొని పోలీసులకు దొరికిపోయిన నిందితులను మనం తరచూ వార్తలలో వింటూనే ఉంటాం. అయితే డబ్బు ఎక్కువగా సంపాదించాలనే ఆశతో ఒక పనిమనిషి సాగించిన నిర్వాకం ఏకంగా కాపురాలనే కూల్చేసింది.
వివరాల్లో కెళితే తిరుపతి మంగళంకు చెందిన చంద్రకళకు మొదటి భర్త గురుమూర్తి తో 2013 సంవత్సరంలో పెళ్లయింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వృత్తి రీత్యా మెకానిక్ అయిన గురుమూర్తి జీతం ఇంటికి సరిపోకపోవడంతో భార్య చంద్రకళ కొన్ని ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ ఉండేది. కొన్ని ఇళ్ళలో పనిలో చేరిన ఆమె వాసు, సత్యనారాయణ, రాజు అనే ముగ్గురు ఇంటి యజమానులతో సహజీవనం చేయడం ఆరంభించింది. అలా కొంతకాలం రహస్యంగా అక్రమసంబంధం పెట్టుకుని ఒక్కొక్కరికీ తెలియకుండా ముగ్గురినీ పెళ్లిచేసుకుంది.
ఇలా పెళ్ళిళ్ళు చేసుకుని వారింట్లో వారి భార్యల నగలు, డబ్బును తీసుకొని జల్సాలకు ఖర్చు పెట్టేది. ఇలా జల్సాలకు రుచి మరిగిన ఆమె ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్థమవగా సదరు వ్యక్తి భార్య పోలీసులను ఆశ్రయించింది. నాకు న్యాయం చేయాలంటూ ఆ వ్యక్తి భార్య పోలీసులను కోరింది. పోలీసులను ఆశ్రయించిన విషయం చంద్రకళకు తెలిసింది. ఇంకేముంది దెబ్బకు ఆమె ఉన్న ప్రదేశంలోనుండి ఉడాయించింది. ప్రస్తుతం పోలీసులు ఆమెకోసం గాలిస్తునారు.