తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఓ కాకలు తీరిన రాజకీయ యోధుడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరుగులేని నేత. ఇప్పుడు అలాంటి నేత ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేసి అక్కడ కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉన్నారు. ఆ నేత ఎవో కాదు ఎర్రబెల్లి దయాకరరావు. టీడీపీ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. కానీ ఆయనకు మాత్రం మంత్రి అయ్యే అవకాశం రాలేదు. ఎలాగైనా ఒక్కసారి అయినా మంత్రి పదవి చేపట్టి బుగ్గకారులో తిరగాలన్నదే ఆయన కోరిక.
గతంలో టీడీపీ తరపున గెలిచిన ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేసిన ఎర్రబెల్లి ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో కేసీఆర్ పిలుపు మేరకు కారెక్కేశారు. అయితే ఇక్కడ మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించినా ఆయనకు నిరాశ తప్పలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో అయినా గెలిస్తే మంత్రి పదవి వస్తుందని ఆయన అనుకుంటున్నా కష్టంగానే కనిపిస్తోంది. మరి ఎర్రబెల్లి కోరిక ఎందుకు తీరేలా లేదని ప్రశ్నించుకుంటే ఆయన సామాజికవర్గమే ఆయనకు మైనస్గా మారింది.
ఎర్రబెల్లి సీఎం కేసీఆర్ సామాజికవర్గమైన వెలమ సామాజికవర్గానికే చెందినవారు. ఈ సామాజికవర్గం నుంచి ఇప్పటికే కేసీఆర్ ఆయన ఫ్యామిలీలోనే అల్లుడు హరీశ్రావుతో పాటు కుమారుడు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ కుమార్తె కవిత సైతం జగిత్యాల నుంచి పోటీ చేసి మంత్రి అవ్వాలని కలలు కంటున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి మంత్రి పదవి కోరిక తీరేలా కనపడడం లేదు. ఒక్క కేసీఆర్ ఫ్యామిలీలోనే నాలుగు మంత్రి పదవులు ఈ సామాజికవర్గం నుంచే ఉంటే ఇక ఎర్రబెల్లికి మళ్లీ మంత్రి పదవి ఇస్తారని ఆశించడం కూడా అత్యేశే అవుతోంది.
ఇక ఎర్రబెల్లి పార్టీ మారాక ఆయనకు దక్కింది ఏంటంటే సీఎం కేసీఆర్ను ప్రత్యేకంగా పాలకుర్తికి రప్పించుకుని రూ.100 కోట్ల నిధులు మాత్రం మంజూరు చేయించుకున్నారు. కేసీఆర్ నిర్వహించిన సర్వేలో లో ఎర్రబెల్లి నంబర్ వన్ స్థానంలో ఉండటం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోజుకు సుమారు ఇరవై గ్రామాల్లో ఎర్రబెల్లి పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎర్రబెల్లి మంత్రి కావడం మాత్రం ఖాయమని పలువురు కీలక నేతలు అంటున్నారు. అయితే ఎర్రబెల్లి ఐదోసారి గెలిచినా ఆయన మంత్రి పదవి కోరిక మాత్రం వచ్చే ఎన్నికల్లో అయినా తీరుతుందా ? అంటే కష్టంగానే కనిపిస్తోంది.