తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యంగా మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ పథకం ఎంతో ఆదరణకు నోచుకుంది. వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా కాళేశ్వరం ప్రాజెక్టు ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాగా, ప్రాజెక్టు నిలుపుదల కోసం కోర్టుల్లో సుమారు 100 కేసులు వేశారు. తాజాగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది.
ప్రాజెక్టు నిర్మాణంపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 23న) కొట్టివేసింది. పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ... ముంపు గ్రామాల్లో సరైన చర్యలు చేపట్టకుండా పనులు చేస్తున్నారని సుప్రీంకోర్టులో హయత్ఉద్దీన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం నిర్మాణాన్ని ఆపాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ సందర్భంగా తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. కోర్టు తీర్పు అనంతరం మీడియాతో హరీష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసిందని ఆయన మండిపడ్డారు.కాంగ్రెస్ నేతలు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన చెప్పారు.
సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ రైతాంగం, ధర్మం, న్యాయం గెలిచాయని ఆయన అన్నారు.ఆకుపచ్చని తెలంగాణ, ఆత్మహత్యలు లేని తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని... ప్రాణత్యాగానికే సిద్ధమైన కేసీఆర్ కు పదవులు ఒక లెక్క కాదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ రైతాంగం గెలిచిందని అన్నారు.