ఏపీలో అధికార టీడీపీ ప్రభుత్వంతో పాటు చంద్రబాబును తరచూ టార్గెట్ చేసే నేతలను వచ్చే ఎన్నికల్లో టార్గెట్ చేసేందుకు చంద్రబాబు సరికొత్త ఎత్తులు, స్కెచ్లు గీస్తున్నారు. అలాగే వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరేందుకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. వైసీపీ లేడీ ఫైర్బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా గత ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా కేవలం 926 ఓట్లతో టీడీపీ సీనియర్ లీడర్ గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై గెలిచారు.
ఎమ్మెల్యేగా గెలిచిన రోజా పదే పదే చంద్రబాబు, టీడీపీని టార్గెట్ చేయడంతో పాటు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. అయినా రోజా తీరు మారలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో రోజాను ఓడించి, ఆమెను అసెంబ్లీ గడప తొక్కనీయకూడదని బాబు తన ప్లాన్లో తాను ఉన్నారు. అయితే అక్కడ పార్టీ సీనియర్ గాలి ముద్దుకృష్ణమ ఆకస్మింకంగా మృతి చెందడంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎవరు ఉంటారు ? అన్నది సహజంగానే ఆసక్తి రేపుతోంది.
రోజాకు ప్రత్యర్థి రెడీ అయినట్టే..
వచ్చే ఎన్నికల్లో నగరిలో రోజాను ఓడిచేందుకు చంద్రబాబు గాలి తనయుడు గాలి భానుప్రకాశ్ నాయుడును రంగంలోకి దించాలని డిసైడ్ అయినట్టే తెలుస్తోంది. గాలి ఉన్నప్పుడే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వారసుడిని రంగంలోకి దింపే అంశంపై ఆయనతో చర్చించారు. దీనిపై వార్తలు కూడా వచ్చాయి. గాలి వయోఃభారంతో ఉండడంతో ఆయనే స్వయంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. అప్పుడే భానుప్రకాష్ నాయుడు పేరు తెరమీదకు వచ్చింది. ఇక ఇప్పుడు గాలి ఆకస్మిక మృతితో చంద్రబాబుకు తక్షణమే నగరిలో టీడీపీ బాధ్యుడిని రంగంలోకి దించాల్సిన అవసరం ఏర్పడింది.
ఇక ఆరేడేళ్లుగా నగరి నియోజకవర్గంతో తిరుగులేని అనుబంధం ఉన్న భానుప్రకాష్ అయితేనే టీడీపీ నుంచి పోటీకి కరెక్ట్ అని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో గాలి ఓడిపోయినప్పటి నుంచి తండ్రికి ఆసరాగా ఉంటోన్న భానుప్రకాష్ నాయుడు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ అటు ప్రజలకు పార్టీ పరంగాను అన్ని కార్యక్రమాలు జనాల్లోకి తీసుకు వెళ్లడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చేయడంలో తనవంతుగా కష్టపడుతున్నారు.
భానుప్రకాష్ దూకుడుతో చివరకు రోజా సైతం తాను హైదరాబాద్లో ఉంటే ఆయన్ను వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టలేనని డిసైడ్ అయ్యి చివరకు నగరిలో సొంత ఇళ్లు సైతం కట్టుకుంటోంది. వచ్చే ఎన్నికలకు గట్టిగా ఇంకా యేడాది కూడా టైం లేదు. త్వరలోనే నగరి టీడీపీ నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు గాలి భానుప్రకాష్కే కట్టబెడుతూ ప్రకటన చేయనున్నారని కూడా పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఏదమైనా ఈ సారి రోజాను అసెంబ్లీ గడప ఎక్కనీయడకూడదన్న పట్టుదలతో ఉన్న బాబు మొత్తానికి ఆ బాధ్యతలను గాలి వారసుడికే అప్పగిస్తున్నారు.