నలభైయెళ్ళ అపార రాజకీయానుభవం అనితర సాధ్యమైన (అ) రాజకీయ కార్యకలాపాలు అవసరమైన చోట్ల 'విభజించు పాలించు ' తరహా వ్యవహారశైలి, అవసరమైతే రాష్ట్రాన్ని రావణ కాష్ఠం చేసే ప్రమాదకరమైన కులం కార్డులు ఉపయోగించి పోరాటాలు సృష్టించటం అంతకు మించి అభ్యంతరకర సమస్యలు సృష్టించి రాజకీయ వైపరీత్యాలు రేకెత్తించి వాటిని ప్రతిపక్షాలు కేంద్రంలోని మిత్రపక్షంపై తోసేసే రాజకీయం అంతకు మించి నిధులిచ్చిన వారికి నిధుల వినియోగ దృవపత్రం అడిగినా యివ్వని తెంపరితనం అనేక విద్రోహకర సంస్థలతో (ఉదాహరణకు ట్రాన్స్-ట్రాయి) వ్యక్తులతో సన్నిహిత సంబంధాలతో రాజకీయాలు నెరపటం "చాణక్యం" అనవచ్చా?
అసలు తెలుగుదేశంలో నందమూరి నుండి తనకు ఆధిపత్య బదిలీలో నేలకొన్న అమావీయ కోణం "వెన్నుపోటు" తో భారత్లోనే కాదు విశ్వమంతా విఖ్యాతమైంది. ప్రజా ప్రతినిధులను కొనగోలు చేసే 'హార్స్-ట్రేడింగ్' రాజకీయవ్యాపారం మొదలు పెట్టిన ఈయన తీరు ఒక ఎపిసోడ్ గా "బ్రీఫ్డ్-మి" "ఓటుకు నోటు" పేర్లతో అపఖ్యాతితో విశ్వ మంతా ప్రఖ్యాతమైంది.అంతేకాదు కేంద్రంతో "ప్రత్యేక హోదా - స్థానంలో ప్రత్యేక పాకేజీ" పేరుతో లాలూచి రాజకీయం నడిపిన తీరు “ప్రత్యేక హోదా సంజీవని కాదని” ప్రజలకు చెప్పిన తీరు నాడు ప్రజలను విస్తు పొయ్యే లాగా చేసింది. ప్రత్యేక హోదా గుఱించి మాట్లాడితే అరెష్ట్ చేస్తామని చెప్పిన పెద్దమనిషి ఊసరవెల్లి లా రంగులు మార్చి నేడు ప్రత్యేక హోదాను మళ్ళా సమర్ధించటం తెలుగు దేశం వాళ్ళకు నచ్చవచ్చునేమోగాని చీమూ నెత్తురూ వ్యక్తిత్వం ఉన్న సాధారణ ప్రజలకు వ్యక్తులకు నచ్చదుగాక నచ్చదు.
అవసరమైతే ఋజువర్తనులను తనవైపు తిప్పుకొని "యూజ్ అండ్ థ్రో" లాగా వాడేసే ఆయన మాయామోహనంలో ఒక ప్రజల మనిషి పడి చిక్కుకుపోవటం అందర్ని ఆశ్చర్య పరుస్తుంది. ఆయనే లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ.
ఆయన
నిజాయితీపైనా పలు మార్లు పలు
విధాల విమర్శలు వచ్చాయి. కానీ వాటికి ఎక్కడా
ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం జనసేన ఏర్పాటు చేసిన "జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ" (జేఎఫ్సీ) లో చేరిన
జయప్రకాష్ నారాయణ ఉరఫ్ జేపీ, ఒక్కసారిగా
ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా వెనుకేసుకొస్తూ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యచకితులను చేసేశాయి.
"కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు" అని మేధావి అయిన జేపీ ఏకపక్షంగా తేల్చేయడంతో మాజీ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు సైతం ఆశ్చర్యపోయారు.
జేపీ ఇలా ఎందుకు మాట్లాడారన్న చర్చ జరుగుతుండ గానే, జేపీని ముఖ్యమంత్రి రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నారంటూ ప్రముఖ తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతునిచ్చే రెండు మూడు మీడియాలో వచ్చిన వార్త కొంత సంచలనమే రేపింది. అప్పటి నుండి రాజకీయం మలుపు తిరిగి కొత్తచర్చకు దారితీసింది. రాజ్యసభ సభ్యత్వం యివ్వజూపటం వలననే జేపీ ముఖ్యమంత్రి కి వంతపాడుతున్నారు అన్న అనుమానాలు బలపడ్డాయి. అంటే ఋజువర్తనులకు ఆశచూపి కలుషితం చేసి ఏది రాజకీయమో ఏది అరాచకీయమో అర్ధకాని పరిస్థితులకు ఈ నలభైయేళ్ళ అనుభవసారాన్ని దారబోయటం జరుగుతూనే ఉంది. ఇప్పటికే జనసేన పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రితో చేరి తన రాజకీయ పాతివ్రత్యాన్ని పోగొట్టుకున్నారు.
జేపీని రాజ్యసభకు జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ సిఫార్సు చేశారని కొందరు చెబుతుండగా, కాదు ముఖ్య మంత్రే పవన్ కళ్యాణ్ తో జేపీ వద్దకు రాజ్యసభ ప్రతి పాదన పంపారని జనసేన వర్గాలు వాదిస్తున్నాయని "ప్రజాశక్తి “ చెబుతోంది. అయితే ఇలా నేరుగా "టీడీపీ బీ-ఫాం" పై రాజ్యసభకు వెళ్తే తన వ్యక్తిత్వం ప్రజల్లో పలుచనై ప్రశ్నార్ధకం అవుతుందేమోనన్న ఆలోచన జేపీ లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.
అంటే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం తీసుకోవాలని దానికి ముఖ్యమంత్రి సహాయం పొందాలని ఉన్నట్లే. "అవ్వా కావాలి బువ్వా కావాలి" అన్న తీరులో అంటే ఒక వైపు ఆయన పాతివ్రత్యం పోకూడదు మరోవైపు రాజ్యసభ సభ్యత్వం పొందటం పై చాలా ఆశలున్నాయన్నమాట. అందుకే "కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు" అనే వ్యాఖ్య చేశారు. ఇది చాలు ఆయన "ఏ పార్టీ, ఏ వ్యక్తి ,ఇంకా ఏ వర్గ, పక్షపాతి" అనేది నిర్ణయించటానికి.
పైగా రాజ్యసభ సభ్యత్వానికై టీడీపీ అభ్యర్థులకు ఓటేసే వారిలో 22 మంది వైసిపి నుండి పార్టీ ఫిరాయించిన వారు కూడా ఉన్నారు. అందుకే ఆయనకు నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లైంది.
అనునిత్యం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, విలువలు అంటూ పరితపించే జేపీ, ఇంతగా రాజ్యసభ సభ్యత్వానికోసం ఇలా ఫిరాయింపులతో మిళితమైన పార్టీ సాయంతో రాజ్యసభకు వెళ్తే, ఆయన ఊహించుకుంటున్న "ఉన్నత వ్యక్తిత్వం" విలువల వలువలు రాజ్యసభలో ఊడి పోతాయని అభి ప్రాయపడుతున్నారు. అందుకే “టీడీపీ- బీఫారం పై కాకుండా స్వతంత్ర అభ్యర్థి” గా నామినేషన్ వేసి, విఙ్జులు మేధావుల కోటా అనే రంగేసుకొని - స్వచ్చందంగా ఓట్లేయాల్సిందిగా కోరితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో జేపీ ఉన్నట్టు తమకున్న సమాచారం అని తద్వారా ప్రజాశక్తి కథనాన్ని ప్రచురించింది.
అయితే, జేపీ టీడీపీ బీ ఫారంపై నామినేషన్ వేసినా, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినా ఆయనకు ఓట్లు వేయాల్సింది మాత్రం అధికార పార్టీ కళంకిత ఎమ్మెల్యేలే నని, కాబట్టి అలాంటప్పుడు తాను పార్టీలతో సంబంధం లేకుండా రాజ్యసభకు వెళ్తున్నానని కబుర్లు చెబితే నమ్మే స్థితిలో ఇప్పుడు జనం లేరన్న అభిప్రాయం కూడా ఉంది.
అంటే ఆయన మాత్రం ‘అడుసుతొక్కుతూ రాజ్యసభలో సభ్యుడుగా ప్రవేసించాలి కాని ఫంకం (బురద) ఏమాత్రం ఆయనపై పడరాదు’ అనే థియరీ అన్నమాట. అంటే ‘పాతివ్రత్యం పోగూడదు కాని అలౌకిక ఆనందం’ కావాలనేదే ఆయన భావన అన్నమాట.
అయితే ఏం జరుగుతుందో చూడాలి, వచ్చిన అవకాశం కోసం జేపీ అర్రులు చాస్తూ వ్యక్తిత్వాన్ని త్యాగం చేస్తారో? లేక సమాజ విమర్శకు జడిసి రాజ్యసభకు వెళ్లే ఆలోచన విరమించుకుంటారో? అనేది ఆయన ‘వ్యక్తిత్వంలోని దృఢత్వానికి’ నిదర్శనం అవుతుంది. ఇక కాలమే ఈ సంశయానికి సమాధానం నిర్ణయిస్తుంది.