అతనొక రాజ్యసభ సభ్యుడు. ఏపీ ప్రజల హక్కులపై సభలో కేంద్రాన్ని నిలదీస్తారని ఆంధ్రులు అశించారు. ప్రత్యేక హోదాపై బీజేపీని కడిగిపారేస్తారని అనుకున్నారు. కానీ ఆ నేత మాత్రం తనకేమీ పట్టదన్నట్లున్నారు. సొంత పార్టీ నేతలు రోడ్లపైకి వచ్చి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్నా... ఆ ఎంపీ గారు మాత్రం గడపదాటి బయటికి రావడంలేదు.
విభజన జరిగిపోయి నాలుగేళ్లు గడిచిపోతోంది. కేంద్రం మాత్రం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలేదు. ఈ విషయంపై టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు సైతం గుర్రుగా ఉన్నాయి. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ తమదైన రీతిలో నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ కూడా కేంద్రం తీరుపై ఆసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎంపీలు లోక్ సభ, రాజ్యసభలో గళం వినిపిస్తున్నారు. అక్కడ వీలుకాకపోతే మీడియా పాయింట్ వేదికగా కేంద్రంపై పోరాడుతూనే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కి చెందిన నేత, ప్రముఖ హీరో చిరంజీవి మాత్రం ఇప్పటి వరకు ప్రత్యేక హోదా విషయంలో సభలో ఒక్కసారి కూడా మాట్లాడిన దాఖలాలు కనిపించలేదు.
ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవని అని భావించిన అన్ని పార్టీల నేతలు తమ ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాత్రం ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ తరుపున రోడ్లపైకి వచ్చి నిరసన తెలపలేదు. అవకాశం ఉండి కూడా పార్లమెంట్ లో మాట్లాడలేదు. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు చేపట్టిన ఆందోళనల్లో కూడా చిరు గారు కనిపించలేదు.
ప్రజల కోసమే ప్రజారాజ్యం పెట్టానని దండోరా వేసిన నేత, ప్రజలు కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించిన నాయకుడు.. ఇప్పుడు ఆ ప్రజల కోసం పోరాడలేకపోతున్నారు. మరో రెండు నెలల్లో చిరంజీవి పదవీ కాలం ముగియనుంది. అయిపోయిందిగా ఇంకెందుకులే అనుకున్నారో.. లేక రాజకీయాలు ఇక ఆపేద్దాం.. సినిమాలే చేసేద్దాం అనుకున్నారో గానీ.. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్క మాటైనా మాట్లాడడంలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ నేతలకు సైతం మాట్లాడడానికి టైమ్ కేటాయించడంలేదట చిరంజీవి. కనీసం ఇప్పటికైనా చిరంజీవి.. ఒక ఎంపీగా రాష్ట్రం కోసం పార్లమెంట్ లో పోరాడతారో.. లేక రెండు నెలలేగా కామ్ గా ఉంటే అయిపోతుందని కాలం గడిపేస్తారో వేచి చూడాలి.