శంకులో పోస్తేనే కానీ తీర్థం కానట్టుగా ఉంది ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి. రాష్ట్రంలో తాను అపర భగీరథుడినని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు నానా తిప్పలు పడుతున్నానని, ప్రాజెక్టుల పరంపరను కొనసాగిస్తున్నానని పదే పదే డబ్బా కొట్టుకోవడంలో తనను, తన టీంను మించిన వాళ్లు లేరనే పేరు తెచ్చుకున్నారు. అయితే, ఆయా ప్రాజెక్టుల వెనుక అవినీతి పారుతోందని, కోట్లాది రూపాయల ధనం చేతులు మారుతోందని, కాంట్రాక్టర్లను మారుస్తూ.. ప్రజలను ఏమారుస్తున్నారని విపక్ష నేత, వైసీపీ అధినేత పదే పదే మూడేళ్లుగా మొత్తుకుంటున్నారు. అతి పెద్ద ప్రాజెక్టయిన పోలవరం కడుతూ.. దానికి అనుసంధానంగా పట్టిసీమ ప్రాజెక్టు కట్టడం అంటే నిధులు మింగేయడమేనని జగన్ అప్పట్లోనే పెద్ద ఎత్తున నిజాలు వెల్లడించారు.
అయితే, బాబు అండ్ టీం మాత్రం జగన్పై బురదజల్లే పనే పెట్టుకుంది. కావాలనే జగన్ ఇలా ఆరోపిస్తున్నాడని, పట్టి సీమ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, పట్టిసీమ లేకపోతే, సీమ ప్రాంతానికి నీరు అందదని చెప్పుకొచ్చారు. ఒకరకంగా ఎదురు దాడి కూడా చేశారు. అయినప్పటికీ జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాను అనుకున్నది, నిజాలు అన్నవి ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూనే వచ్చారు. ఇక, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏ పార్టీని బాబు నమ్ముకున్నారో? ఏపార్టీని నమ్మి ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడి ఏపీ ప్రజలను నిలువునా ముంచాలని చూశారో ఆ పార్టీ బీజేపీ.. ఆయనకు చక్కగా హ్యాండిచ్చింది. అంతేకాదు, బాబుతో ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధమైంది. ఒకరకంగా బాబుకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే బీజేపీ కన్నెర్ర చేసిందా అన్నట్టుగా బాబు అవినీతి విషయాలను సీరియల్ మాదిరిగా వెలికి తీసేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పట్టిసీమలో జరిగిన అవినీతిపై అసెంబ్లీలో నిలదీశారు. పట్టిసీమ ద్వారా కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వ పెద్దలు దోచుకోలేదా? అని సూటిగా ప్రశ్నించారు. పట్టిసీమ కట్టడం ద్వారా ఎవరికి ప్రయోజనం కలిగించారో వివరించాలని పట్టుబట్టారు. ఈ పరిణామంతో నిర్ఘాంత పోయిన చంద్రబాబు నోరెళ్ల బెట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం తన జీవిత ఆశయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి దాని నిర్మాణం చేపడుతుంటే బురద చల్లే కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పోలవరం ప్రాజెక్టు కోసం పనిచేస్తుంటే దానిలో అవినీతి జరిగిపోతోందని, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. తానే రోజూ లాలూచీ పడలేదన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రతి రైతు ఆశగా చూస్తున్నాడని అన్నారు. కరవు వస్తే ఏమవుతుందనే ఆందోళనలో రైతులు ఉన్నారని, ఇది పూర్తయితే నీటి భద్రత వస్తుందన్నారు. పోలవరం పూర్తిచేయడంలో రాజీలేదన్నారు. పోలవరం కోసం ఇప్పటివరకు 13,201 కోట్లు ఖర్చు చేశామన్నారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఇప్పటిదాకా 11 ప్రాజెక్టుల పనులే ప్రారంభం కాలేదన్నారు. అయితే, బీజేపి చేసిన ఇవే ఆరోపణలు జగన్ చేస్తే ఎదురు దాడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇలా వివరణ ఇచ్చుకోవడం వెనుక ఏదో ఉందని అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి ఈ పరిణామం ఇప్పటితో ఆగేలా లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.