ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఏకతాటిపై వస్తూ..కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. తాము ఎన్నుకున్న నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఏపికి ప్రత్యేక హోదా కల్పించే వరకు పోరాటం చేయాలని..లేదంటే ఏపిలో ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగిస్తామని ప్రజలు అంటున్నారు. ఇక సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ.. ఏపీ నేతలకు ఏదైనా కీడు తలపెడితే ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.
తాను మూడో కన్ను తెరవనున్నానని, ఈ సాయంత్రం ఓ కీలక ప్రకటన చేస్తానని, దాంతో బీజేపీ దిమ్మ తిరుగుతుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమతమ విధానాల్లో పోరాడుతున్న చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ లపై ఈగను కూడా వాలనివ్వబోనని నటుడు శివాజీ వెల్లడించారు. ప్రజలకు సంచలన విషయాలను వెల్లడించనున్నానని, తన ప్రకటనతో ప్రత్యేక హోదా సాధన సమితికిగానీ, పార్టీలకుగానీ, వ్యక్తులకుగానీ సంబంధం ఉండదని స్పష్టం చేశారు.
అంతే కాదు లోక్ సభలో రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టబోతున్నారని హీరో శివాజీ అన్నారు. దీనికి సంబంధించి తనకు స్పష్టమైన సమాచారం అందిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఆరుగురు వ్యక్తులు లోక్ సభలో మాట్లాడతారని... వారిలో ముగ్గురు ఇంగ్లీషులో, మరో ముగ్గురు తెలుగులో మాట్లాడతారని చెప్పారు.
ఏపీకి అంతా చేసేశామని చెప్తారని తెలిపారు. మన ఎంపీలకు ఇంగ్లీషు పెద్దగా రాదనే భావన ఢిల్లీలో ఉందని అన్నారు. అంతా అయ్యాక.. అవిశ్వాసాన్ని వ్యతిరేకించే వారు చేయెత్తాలని స్పీకర్ అడుగుతారని, అనుకూలంగా ఉండేవారు చేయెత్తాలని అడుగుతారని చెప్పారు. చివరకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉండేవారే ఎక్కువగా కనిపిస్తున్నారంటూ... అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తారని తెలిపారు.