మరో నెల రోజుల్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా భావి స్తున్నాయి. అదికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, పూర్వ వైభవం కోసం బీజేపీలు హోరా హోరీ యుద్ధం చేసుకుంటు న్నాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీల ప్రధాన నేతలూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సీఎం సిద్దూ అవినీతి పరుడని బీజేపీ దుమ్మెత్తి పోస్తుండగా, బీజేపీనే గత దొంగల పార్టీ అంటూ కాంగ్రెస్ విమర్శలు సంధిస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ప్రచారం హద్దులు, సరిహద్దులు కూడా దాటిపోతోంది. ఇదలావుంటే, ఇప్పుడు మరో ఆసక్తికర కోణం వెలుగు చూస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర, మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రలు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.
మైసూరు శివార్లలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఈ ఇద్దరు నేతల తనయులు ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వరుణ నియోజకవర్గానికి ప్రాధాన్యం పెరిగిపోయింది. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో సీఎం సిద్దరామ య్య పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి సిద్దరామయ్య.. గతంలో ఏడు సార్లు.. చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే, అనూహ్యంగా గత ఎన్నికల్లో వరుణ నియోజక వర్గానికి మారి..
ఇక్కడి నుంచి గెలుపొందారు. అయితే ఈసారి మళ్లీ తన కంచుకోట చాముండేశ్వరి నుంచే పోటీ చేయాలని సిద్దూ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుణ నుంచి తనయుడు యతీంద్రను రంగంలోకి దించాలని సిద్దూ డిసైడ్ చేసుకున్నారు. సిద్దరామయ్య కొడుకుకు సమ ఉజ్జీగా బీజేపీ తరఫున మోహరించడానికి మాజీ సీఎం యడ్యూరప్ప తనయుడు విజయేంద్ర అభ్యర్థి అయితేనే.. పోటీ రంజుగా ఉంటుందని స్థానిక కమల నాథులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే అమిత్ షాకు ఓ వినతిపత్రం కూడా సమర్పించారు. మైసూరు ప్రాంతం సాధారణంగా సిద్ధరామయ్యకు బలమైన ప్రాంతం. అలాంటి నేపథ్యంలో.. ఆ పార్టీ మీద పైచేయి సాధించాలంటే.. ఆయన కంచుకోట నుంచే ప్రారంభించాలని.. అందుకు బలమైన అభ్యర్థులనే రంగంలోకి దింపాలనే అభిప్రాయం బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. కానీ, బలాబలాలు మాత్రం బీజేపీకి అంత అనుకూలంగా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ సిద్ధరామయ్యపై యడ్యూరప్ప ప్రధాన అనుచరుడు సిద్ధలింగస్వామి కేజీపీ తరఫున బరిలోకి దిగి 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
ఇప్పుడు ఆ ఓట్ల బలానికి కమలదళం బలం కూడా తోడవుతుంది. కానీ.. యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర ఈ నియోజకవర్గానికి స్థానికేతరుడు అనే ప్రచారం కూడా ఉంది. అదే సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర స్థానికుడే కావడం విశేషం. మరి ఈ సీఎం ల వారసులు.. పరస్పరం తలపడే వరుణ వార్ ఫీల్డ్ ఎవరిని వరిస్తుండో వేచిచూడాలి. ఏదేమైనా.. సీఎం, మాజీ సీఎం తనయులు తలపడుతున్న నియోజకవర్గంపై అంచనాలు పెరుగుతున్నాయి