జనసే, సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఉమ్మడిగా నడిపించాలనే ఒక అవగాహనకు వచ్చారు. వారం క్రితం పవన్ తో సమావేశమైన వామపక్ష నేతలు.. జిల్లాల్లో ఉదృతంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. కానీ అంతలోనే ఏమైందో ఏమోగాని.. మూడూ పార్టీలు ఎక్కడా కలవడం లేదు..కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలపై మూడు పార్టీలు కలిసి ముప్పేట దాడి చేయాల్సిన సమయంలో ఎవిరికి వారే యమునా తీరే అన్న చందంగా విడివిడిగానే ఉద్యమిస్తున్నాయి. అందరి అజెండా ఒక్కటే అయినా.. ఎవరి జెండా కింద వాళ్లే పోరాటం చేస్తున్నారు. అఖిల సంఘాల సమావేశం నుంచి బీజేపీ కార్యాలయం ముట్టడి వరకూ మీకు మీరే మాకు.. మేమే అన్నచందంగా పార్టీలు నడుచుకుంటున్నాయి.
ప్రత్యేకహోదా సాధన కోసం వారం రోజుల క్రితం కలిసి పోరాటం చేయాలని నిర్ణయించిన సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు.. ఇప్పుడు ఎవరికి వారే అన్నచందంగా సొంతంగా పోరాటాలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని జిల్లాల్లో హోదాపై ప్రజలను చైతన్యం చేస్తామని జతకట్టిన పార్టీలు.. ఉమ్మడిగా కాకుండా ఎవరి దారిలో వారు నడుస్తుండడం విమర్శలకు తావిస్తోంది.. ప్రత్యేకహోదాపై అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది జనసేన పరిస్థితి. హోదాపై పూర్థిస్థాయి ఆందోళనలు చేయడంలో విఫలమైన జనసేన కార్యకర్తలు.. అప్పడప్పుడు అక్కడక్కడా ఆందోళనల్లో పాల్గొంటూ మెరుస్తున్నారే తప్ప.. క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించడంలో విఫలమౌతున్నారనే అభిప్రాయం నెలకొంది. ఈక్రమంలోనే వామపక్షాలతో కలిసి జనసేన విస్తృతంగా పోరాటం చేస్తుందని అంతా భావించారు. కానీ.. సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు ఇటీవల కాలంలో ఉమ్మడిగా పోరాటాలు చేసిన దాఖలు కనిపించడం లేదు.
తాజాగా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని సీపీఐ రాష్ట్ర నాయకులు బీజేపీ స్టేట్ ఆఫీస్ ని ముట్టడించారు. ఒక్కసారిగా cpi నాయకులు బీజేపీ ఆఫీస్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. లోపలి నుంచి బీజేపీ నేతలు కూడా బయటకి రావటంతో వాతావరణం వేడెక్కింది. ఇరు వర్గాల నాయకులు పరస్పర దూషణలకి దిగారు. పోలీసుల జోక్యంతో ఇరు వర్గాలని అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం సీపీఐ నేతల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
బీజేపీ ఆఫీస్ ముట్టడిలో జనసేన, సీపీఎం కార్యకర్తలు కనిపించలేదు. కేవలం సీపీఐ ఆధ్వర్యంలోనే ఆందోళన నడిచింది. అంతేకాదు.. మొన్నటికి మొన్న జరిగిన అఖిల సంఘాల సమావేశంలో సైతం ఈ గ్యాప్ స్పష్టంగా కనిపించింది. ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం హాజరుకాగా.. జనసేన దూరంగా ఉంది.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై మూడు పార్టీలు కలిసి ముప్పేట దాడి చేస్తాయని అంతా భావించినా.. జరుగుతున్న పరిణామాలు కేడర్ ను అయోమయానికి గురిచేస్తున్నాయి. కిందిస్థాయిలో పోరాటాలు ఎలా ఉండాలి.. ఎవరు ఎవరితో కలిసి నడవాలనేదానిపై క్లారిటీ లేకుండా పోతోంది.