జాతీయ స్థాయిలో సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సర్వే చేసిన సంస్థలు జగనే సిఎం అని బల్ల గుద్ది చెబుతున్నాయి. జమిలీ ఎన్నికలు జరిగితే ఈ ఏడాది చివర్లోనే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. లేనిపక్షంలో వచ్చే ఏడాది ఏప్రిల్,మే మాసాల్లో ఎన్నికలు జరగి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఎప్పుడు ఎన్నికలొచ్చినా, తమ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమన్నట్లుగాఅధినేతలు కసరత్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, జాతీయ స్థాయిలో సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. జాతీయ పార్టీలుగా గుర్తింపు ఉన్నవాటితో పాటు ప్రాంతీయ పార్టీలపై కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు కన్నేశాయి. వీటితో పాటు జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ సర్వేలపై ఫోకస్ పెడ్తున్నాయి. ఏయే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఉంది,ఏ పార్టీలు అధికారంలోకి వస్తాయి, లోక్ సభ స్థానాలు ఎన్ని గెలుచుకోగలరు, ముఖ్యంగా యూపీఏ,ఎన్డీయే మిత్ర పక్షాల పట్టు ఎలా ఉంది.. ఇలా అనేక విషయాలపై సమగ్రంగా సర్వే చేస్తున్నాయి పలు ప్రైవేట్ సంస్థలు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై కూడా ఇప్పటికే అనేక సంస్థలు సర్వేలు జరిపాయి.
వాటిలో తాజాగా పేరుమోసిన జాతీయ ఛానెల్ ఒకటి ఏపీపై సర్వే రిపోర్ట్ ను రిలీజ్ చేసింది.అందులో ఊహించని ఫలితాలు వెలువడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు కు రోజులు దగ్గరపడ్డాయని,ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ప్రజలంతా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆ సర్వే తెలిపింది. చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణం ఎన్డీయేనని, ఆయన గత 2014 ఎన్నికల్లో ఇటు ఎన్డీయేతో,అటు జనసేన తో పొత్తు పెట్టుకోవడం వల్లే అధికారంలోకి వచ్చారని,కానీ 2019 లో మాత్రం ఆ పరిస్థితి లేదని, ఆ ఇద్దరు మిత్రులు ప్రస్తుతం చంద్రబాబుకు దూరమైనందున టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదని స్పష్టం చేస్తున్నారు.