దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి దక్షిణాదిలో జరుగుతోన్న కర్నాకట ఎన్నికల మీదే ఉన్నాయి. గత రెండేళ్లుగా నార్త్లో వరుస విజయాలతో దూసుకుపోతోన్న బీజేపీకి గత కొద్ది నెలలుగా మాత్రం వరుస షాకులు తగులుతున్నాయి. యూపీలోని పుల్ఫూర్, గోరఖ్పూర్, బిహార్లోని అరారియా లోక్సభ స్థానాలతో పాటు రాజస్థాన్లోని రెండు లోక్సభ సీట్లకు, పంజాబ్లోని అమృత్సర్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సీట్లు కోల్పోయింది. మోడీ నియంతృత్వ విధానానికి, అహంకార పూరిత నిర్ణయాలకు ఈ ఫలితాలే నిదర్శనమని మోడీ వ్యతిరేక పార్టీలు, ప్రజలు విరుచుకుపడుతున్నారు.
ఇక 2019 లోక్సభ ఎన్నికలకు ఈ ఎన్నికలు సెమీఫైనల్స్ అని అందరూ చెపుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత బీజేపీకి పట్టున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పుడు ఈ ఎన్నికలకు ముందుగా అందరి దృష్టి కర్నాటక ఎన్నికల మీదే ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్న ఒకే ఒక పెద్ద రాష్ట్రం కర్నాకటను కూడా గెలుచుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ తమ చేతిలో ఉన్న ఒక్క పెద్ద రాష్ట్రాన్ని తిరిగి నిలపెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.
ఇక కర్నాటకలో ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే రెండు మూడు ప్రీ పోల్ సర్వేలు కూడా కాంగ్రెస్ తిరిగి అధికారం నిలపెట్టుకుంటుందని చెప్పాయి. అయితే బీజేపీకి అక్కడ వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేలోనూ అక్కడ కన్నడ ఓటర్లు మరోసారి సిద్ధరామయ్యకే పట్టం కడుతున్నారని తేలింది.
ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య విధానాలు, పాలన తీరు, అమలు చేస్తున్న పథకాలు వంటి వాటిని తెగ మెచ్చుకుంటున్నారు. సిద్దరామయ్య పనితీరు బేషుగ్గానే ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), దక్ష్ సంస్థలు నిర్వహించిన తాజా సర్వేలో కన్నడిగులు వెల్లడించారు. 224 శాసనసభ నియోజకవర్గాల్లోని 13,244 మంది ఓటర్ల అభిప్రాయాలను ఈ సంస్థలు సేకరించాయి. 2017 డిసెంబర్ నుంచి ఈ యేడాది ఫిబ్రవరి వరకు ఈ సర్వే జరిగింది. ఇక ఈ సంస్థలు చేసిన సర్వేలో ప్రతి 10 మందిలో 7 గురు ఓటర్లు సిద్ధరామయ్య ప్రభుత్వానికే జై కొట్టారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే వరుస షాకులతో ఉన్న కన్నడ బీజేపీకి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఇప్పటికే మరాఠా సరిహద్దు ప్రాంతాల్లో శివసేన ఒంటరి పోరుకు రెడీ అవుతోంది. ఇప్పుడు మరో మిత్రపక్షం కూడా షాక్ ఇచ్చింది. బిహార్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ... కర్ణాటకలో మాత్రం అందుకు విరుద్ధమైన వ్యూహాన్ని అమలు పర్చాలని తీర్మానించింది. తమ పార్టీ కన్నడనాట కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరాన్ని పాటిస్తుందని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిమాపటేల్ స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో 25 నుంచి 30 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా బిహార్ సీఎం నితీశ్కుమార్ ఈ నెల 12న బెంగళూరు వస్తున్నారని మహిమాపటేల్ చెప్పారు.