భారత్ లో పౌరుల గుర్తింపు లేదా పౌరసత్వ గుర్తింపు పత్రం గా ఆధార్ రూపుదిద్దుకోవాలని కేంద్రం యోచిస్తుంది. కాని ఆధార్ కు మించిన వివరాలు ఇతర గుర్తింపు పత్రాల్లో లభిస్తూనే ఉన్నాయి. అధార్ ద్వారా "ప్రభుత్వం నుండి ప్రజలు మరియు ప్రజలనుండి ప్రభుత్వం" పొందే "ఆ ఎక్కువ" ప్రయోజనాలేమిటో? అని అర్ధం ద్వనించేలా ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
2016 నాటి ఆధార్ చట్టం, పథకంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న చీఫ్-జస్టిస్ దీపక్మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం కేంద్రంప్రభుత్వ వాదనలను విభేదిస్తూ తీవ్రవ్యాఖ్యలు చేసింది.
అవినీతిపరులు, అక్రమాలకు పాల్పడేవారితో అధికారులు కుమ్మక్కవడంవల్లే కుంభకోణాలు జరుగుతున్నాయని, వీటిని నిరోధించడంలో "ఆధార్" పాత్ర బహు స్వల్పమని భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బ్యాంకు కుంభకోణాల నివారణకు ఆధార్ పరిష్కారం కాదని అభిప్రాయపడింది. ఉగ్రవాదులకు నిధుల అందకుండా చూడ టానికి, ప్రభుత్వ సబ్సిడీలు దారిమళ్లకుండా ఉండటానికి, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతకు ఆధార్ ఎంతో ఉపకరిస్తోందన్న కేంద్రం వాదనల తో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు.
అవినీతిపరులతో బ్యాంకు ఉద్యోగులు చేతులు కలపడంవల్లే కుంభకోణాలు జరుగుతున్నాయి తప్ప, ఎవరో తెలియనివారు మోసాలకు పాల్పడటం లేదని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. "ఎవరికి ఋణాలు ఇస్తున్నారో బ్యాంకులకు ముందుగానే తెలుసు. అవినీతిపరులను గుర్తించడంపై ఎటువంటి అనుమానం ఉండదు. వారితో బ్యాంకుఉద్యోగులు కుమ్మక్కవు తున్నారు. దీనిని నివారించడంలో ఆధార్ చేసేది ఏముంది...అందులో ఆధార్ పాత్ర శూన్యం లేదా బహు స్వల్పమే" అని జస్టిస్ ఏకే సిక్రి, ఏఎమ్ ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్ వ్యాఖ్యానించారు.
"ఎక్కువ గుర్తింపు పత్రాలు ఉండటం వల్ల బ్యాంకుల్లో అక్రమాలు జరగడం లేదు" అని ధర్మాసనం కేంద్రప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న అటార్ని జనరల్ కేకే వేణుగోపాల్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉద్యోగ కల్పన గ్యారంటీ చట్టం - ఎమ్జీఎన్ఆర్ఈజీఏ వంటి పథకాల్లో ఇప్పుడు అందుబాటులో లేని లబ్దిదారుల గుర్తింపునకు మాత్రమే ఆధార్ ఉపకరిస్తుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
ఆ సందర్భంలో వాదనలు మొదలుపెట్టిన వేణుగోపాల్ టెర్రరిస్టులను గుర్తించడానికి, బాంబులను గుర్తించడానికి ఆధార్ తో మొబైల్ ఫోన్ నెంబర్లు అనుసంధానం చేసు కోవాల్సి ఉంటుందని అన్నప్పుడు కోర్టు తీవ్రంగా స్పందించింది.
"సిమ్ కార్డుల కోసం టెర్రరిస్టులు దరఖాస్తు చేస్తారని మీరు భావిస్తున్నారా? ఇది ఒక సమస్యా? దీనికోసం మీరు దేశంలోని మొత్తం 120కోట్లమంది మొబైల్ ఫోన్లను ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని చెబుతారా?" అని ప్రశ్నించింది. ఇందులో కేంద్రం ఉద్దేశమేమిటో, సహేతుకత ఏమిటో అర్ధం కావటం లేదని, స్పష్టత లేదని పేర్కొంది. విధ్వంసాన్ని నిరోధించడానికి ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపి వేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ దేశంలోని ప్రజలందరినీ ఆధార్ తో తమ ఫోన్ నెంబర్లను అనుసంధానం చేయాలంటే సమస్యగా మారుతుందని న్యాయమూర్తులు అభిప్రాయ పడ్డారు.
పేదరికం నిర్మూలనకు ఆధార్ ఉపకరిస్తుందన్న వాదనతోనూ సుప్రీం ఏకీభవించలేదు. స్వాతంత్య్రం వచ్చాక సంపన్నులు, పేదల మధ్య అంతరం విపరీతంగా పెరిగి పోయిందని, 67 శాతం సంపాదన ఒక్కశాతం సంపన్నుల చేతుల్లోకి చేరిందని వ్యాఖ్యానించిన సుప్రీం పేదరికం తగ్గుతోందేమో కానీ, పేదల సంఖ్యమాత్రం పెరుగు తోందని వ్యాఖ్యానించింది.
కాగా ఆధార్ కోసం సేకరిస్తున్న ప్రజల దైహిక సమాచారం అంటే బయోమోట్రిక్ ఆధారాల పట్ల పలు ప్రశ్నలు సంధించింది. ఫోటో, వేలి ముద్రలు, ఐరిస్, ముఖ కవళికల తో పాటు ముందు ముందు డీఎన్ఎ, రక్తం నమూనాలు కూడా అడుగుతారేమోనని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
"ఆధార్కు ఎక్కువమంది అభ్యంతరాలు చెప్పడం లేదు. కానీ ప్రతీ ఒక్క పనికీ దానిని అనుసంధానం చేయాలనడమే సమస్య. ఇందులో సహేతుకత ఏమిటన్నది తలెత్తు తున్న ప్రశ్న" అని వారు అన్నారు. కాగా అటార్నీ జనరల్ మాట్లాడుతూ ఆధార్ కోసం చాలా తక్కువ వివరాలే సేకరిస్తున్నారని, ఆయా వివరాలు అంతకు ముందే అందరికీ అందుబాటులో ఉంటున్నాయని, సుప్రీంకోర్టు లాయర్లు, ఉద్యోగుల వివరాలు ప్రజా ప్రభుత్వ సంస్థాన వేదిక - పబ్లిక్ డొమైన్ లపై ఉన్న విషయాన్ని ఉదహరించారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేత వంటి కార్యక్రమాలకు ఆధార్ బాగా ఉపకరిస్తోందని ఆయన వాదించారు.