ప్రధాని మోదీపై మండిపడ్డారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చని కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఆయనకు ప్రేమ, అనురాగం, అభిమానం అంటే ఏంటో తెలియవన్నారు. ప్రతి రాష్ట్రాన్ని గోద్రాలా చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మోదీకి కుటుంబం ఉంటే ప్రేమ, ఆప్యాయత అంటే ఏంటో తెలుస్తుందని... అందుకే ఆయనకు ప్రేమ, అనురాగం, అభిమానం అనేవి లేవన్నారు.
ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుంటే ప్రేమంటే ఏంటో తెలుస్తందన్నారు జేసీ. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘చరిత్రను పక్కదోవ పట్టించే పనులు చేయొద్దు. మేము చిత్తశుద్ధితో పోరాడుతున్నాం. అవసరమైతే రాజీనామాలు చేస్తాం. కానీ, రాజీనామాలు చేయడం ద్వారా ప్రత్యేక హోదా రాదు. ఐదుగురు రాజీనామాలు చేసినా, ఏడుగురు రాజీనామాలు చేసినా ఏం ఉపయోగం లేదు.
నరేంద్ర మోదీ అనేటువంటి వాడు కఠిన శిల, స్పందించే హృదయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమతో దేశాన్ని పరిపాలించలన్నారు ఎంపీ జేసీ దివాకర్రెడ్డి. కాని మోదీ మాత్రం ఈర్ష్య, అసూయ, శత్రుత్వంతో పాలనను చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు తెలుగువాళ్లంటే అంత శత్రుత్వం ఎందుకో అర్థం కావడం లేదన్నారు.
ప్రేమాభిమానాలు అంటే అతనికి తెలియవు. ఆ పద్ధతిలో అతను పెరగలేదు. ప్రేమతో పనిచేయడం నేర్చుకో! అనాధాశ్రమానికి వెళ్లి ఇద్దరు పిల్లలను తెచ్చి పెంచుకుంటే, ఆ ప్రేమ మాధుర్యమేంటో తెలుస్తుంది! నీకేమి (మోదీ) తెలుస్తుంది! అమ్మను ఒకచోట మూలన పారేశావు, ఇంకొక ఆమెను ఇంకో చోట పారేశావు..టింగ్ రంగా అంటూ నువ్వొక్కడివే ఉన్నావు! ప్రేమను పంచు..ప్రేమను స్వీకరించు!’ అని మోదీకు ఆయన సూచించారు.