ఏపీ హక్కుల కోసం పోరాడుతున్న టీడీపీ ఎంపీలకు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు పలికారు. ఆదివారం ఉదయం ప్రధాని మోదీ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను పోలీసులు అరెస్టు చేసి తుగ్లక్రోడ్డు పోలీస్స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న కేజ్రీవాల్ నేరుగా పీఎస్కు వెళ్లారు. అక్కడ ఎంపీలను పరామర్శించిన ఆయన... వారికి సంఘీభావాన్ని తెలిపారు. కేంద్రంపై పోరాడుతున్న టీడీపీ ఎంపీలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు కేజ్రీ.
ప్రధానిని కలిసేందుకు వెళ్తున్నవారిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు కేజ్రీవాల్. కనీసం ఎంపీలన్న గౌరవం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఏపీకి సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లను కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏపి ప్రజలు, నాయకులు కొత్తగా ఏమీ కోరుకోవడం లేదని..ఇచ్చిన హామీలు నెరవేర్చమని మాత్రమే కోరుతున్నారని..అలాంటి ఇంత కాలం తాత్సరాం చేయడం కేంద్రం సిగ్గు పడాల్సిన విషయం అని ఆయన అన్నారు.
అధికారంలో ఉన్న టీడీపీ ప్రజల కోసం పోరాటం జరుపుతుంటే..అరెస్టులతో వారి ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నించే మోదీని ప్రజలు క్షమించబోరని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని మరోమారు స్పష్టం చేసిన కేజ్రీవాల్, ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
ఈ రోజు ఉదయం రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి నివాసంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన ఎంపీలు.. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ప్రధాని నివాసం ముట్టడికి యత్నించారు. ప్లకార్డులు చేతబూని ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
‘మాకు న్యాయం కావాలి’ అంటూ డిమాండ్ చేశారు. ప్రధాని నివాసం ముట్టడికి యత్నించిన ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని తుగ్లక్ పోలీస్స్టేషన్లో ఉంచారు. దీంతో అక్కడికి చేరుకున్న కేజ్రీవాల్ ఎంపీలతో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు.