ఆరు రోజులుగా ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఏపీ భవన్ లో దీక్ష కొనసాగిస్తున్న మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను పోలీసులు బలవంతంగా లిఫ్ట్ చేశారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షను విరమించేందుకు ఎంపీలు అంగీకరించకపోయినా.. బలవంతంగా తరలించేందుకు తాము అంగీకరించబోమని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం తరలించేశారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ 6 రోజులుగా వైసీపీ ఎంపీలు ఢిల్లీలోని ఆంధ్రాభవన్ లో ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఐదుగురు ఎంపీలు దీక్షకు కూర్చోగా ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇంతకుముందే ఆసుపత్రికి తరలించారు. మేకపాటి, వరప్రసాద్, ఎస్వీ సుబ్బారెడ్డిలను ముందుగానే రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించినా కూడా వారు అక్కడే దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు ఏపీ భవన్ లో అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి దీక్ష కొనసాగించారు.
6వ రోజు ఇద్దరు ఎంపీల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే దీక్షకు స్వస్తి చెప్పాలని వైద్యులు సూచించారు. అయితే ఎంపీలు మాత్రం నిరాకరించారు. అయితే దీక్ష కొనసాగించడం ఎంతమాత్రం సమంజసం కాదని వైద్యులు తేల్చి చెప్పడంతో పోలీసులు బలవంతంగా తరలించేందుకు నిర్ణయించారు. దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టి బలవతంగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నీరసంగా ఉండడంతో ఎంపీలు ప్రతిఘటించేందుకు కూడా శక్తి సరిపోలేదు. అయినా తమ శక్తీ కొద్దీ దీక్ష భగ్నానికి నిరాకరించారు.
ఎంపీలను బలవంతంగా తరలించడాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుబట్టాయి. బలవంతంగా దీక్షను భగ్నం చేయడం సరికాదన్నాయి. అయినా తమ పోరాటం ఆగదని, దీక్ష కంటిన్యూ చేస్తామని వైసీపీ శ్రేణులు ప్రకటించాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే తమ ధ్యేయమని తేల్చి చెప్పాయి.