గత కొద్ది రోజులుగా టీవీల్లో న్యూస్ ఛానళ్లు కుటుంబంతో సహా చూడటానికి భయపడిన వారంతా ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎప్పుడు ఎలాంటి బూతు పదాలు వినాల్సి వస్తుందోనని రిమోట్ చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ టీవీల ముందు కూర్చున్న ప్రజలు ఎటువంటి భయం లేకుండా న్యూస్ ఛానళ్లు చూస్తున్నారు. సుదీర్ఘమైన డిబేట్లతో ప్రేక్షకుల సహనానికి ఎంతో పరీక్ష పెట్టిన ఛానళ్లు తమ పంథా మార్చుకున్నట్లు కనిపిస్తున్నాయి.
నటి శ్రీరెడ్డి అంశం టాలీవుడ్ను ఎంత షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అంశం అనేక మలు పులు తిరుగుతూ చివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్దకు చేరడంతో తారస్థాయికి చేరింది. ఇన్నాళ్లూ ఆమెను కూర్చోపెట్టి.. గంటల గంటల పాటు చర్చా వేదికలు నిర్వహించిన ఛానళ్లు ఇప్పుడు వెనకడుగు వేశాయి. పవన్ నేరుగా మీడియా యాజమాన్యాలను టార్గెట్ చేయడంతో పరిస్థితి కొంత వరకూ సద్దుమణిగిందనే చర్చ మొదలైంది.
తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా నిలిచిన శ్రీరెడ్డి.. హఠాత్తుగా టీవీల్లో కనిపించడం మానేశారు. ఆమెకు సంబంధించిన విషయాలు, ఆమెతో ఇంటర్వ్యూలు ఎక్కడా వినిపించట్లేదు. మొన్నటివరకూ ఏ న్యూస్ ఛానల్ చూసినా కనిపించిన ఆమెను ఇప్పుడు న్యూస్ చానళ్లు వదిలేశాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ అంశంలోకి వచ్చిన దగ్గర నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తన తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రంగా స్పందించడంతో పాటు.. ఆమెకు అండగా నిలిచిన మీడియా చానళ్లపైనా ఎదురుదాడి దిగిన విషయం తెలిసిందే!
ట్విటర్ వేదికగా ఆయా సంస్థల యజమానులకు సంబంధించిన వీడియోలు, ఇతర అంశాలు ప్రస్తావిస్తూ ట్వీట్లు చేస్తూ సంచలనం రేపుతున్నాడు పవన్. రోజుల తరబడి శ్రీరెడ్డి, ఇతర సినిమా నటులతో రోజులకు రోజులు.. గంటలకు గంటలు చర్చలు జరిపిన చానెళ్లు పవన్ కళ్యాణ్ ఎటాక్ తో కాస్త విరామం ప్రకటించినట్లు కనిపిస్తోందనే చర్చ మొదలైంది. సహజంగానే సినిమాకు సంబంధించిన అంశాలు అంటే ఎక్కువ మంది చూస్తారు. టీఆర్పీ రేటింగ్ లు వస్తాయి.
అందుకే ప్రేక్షకుల అటెన్షన్ తమ వైపు నుంచి మళ్లకుండా ఉండేందుకు.. కొన్నిఛానళ్లు మరింత మసాలా జోడించి మరీ చర్చను రక్తికట్టించే ప్రయత్నం చేస్తాయి. శ్రీరెడ్డి విషయంలోనూ కొంత కాలం నుంచి ఇదే సాగుతోంది. ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత అది మరింత ఎక్కువైంది. ఇది పీక్ కు చేరడం.. పవన్ తల్లిని అసభ్య పదజాలంతో ఆమె దూషించడంతో తదుపరి లెవల్కు వ్యవహారం వెళ్లింది. ఇందులో రాజకీయపరమైన కుట్ర కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది.
తనపై ఎన్ని విమర్శలు చేసినా భరిస్తూ వస్తున్న పవన్.. శ్రీరెడ్డి విషయంలో నేరుగా రంగంలోకి దిగాడు. ముఖ్యంగా గతంలో ఎప్పుడూలేని విధంగా మీడియాపై డైరక్ట్ ఎటాక్ కు దిగాడు. కొంతమంది మీడియా అధిపతుల వ్యక్తిగత అంశాలపై కూడా ట్విట్టర్ వేదికగా ఎటాక్ ప్రారంభించారు. దీంతో గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి అంశం పక్కకు పోయింది. ఈ కారణంగానే టీవీల్లో వేరే వేరే అంశాలపై చర్చలు ప్రారంభమయ్యాయి. శ్రీరెడ్డి ఇంకా తన ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నా వాటిని చిన్నచిన్న వార్తలతోనే సరిపుచ్చేస్తున్నారు. మొత్తానికి రాజకీయ అంశాలు ఎలా ఉన్నా టీవీ ప్రేక్షకులకు మాత్రం పవన్ కళ్యాణ్ ఊరట కల్పించారు.