నన్ను అంతం చేసేందుకు కుట్ర జరుగుతోంది. నేను ఐదు కోట్ల మంది ఆంధ్రుల తరఫున కేంద్రంపై పోరాటం చేస్తున్నాను., ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్నాను. నాపై కుట్ర జరుగుతోంది. మీరంతా అడ్డుగోడగా నిలిచి నన్ను కాపాడుకోవాలి. - ఇదీ నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఆయన ప్రసంగం రకరకాల ఆలోచనలు, సందేహాలు, చర్చలకు తావిస్తోంది. ప్రజలంతా బాగుండాలన్న ఉద్దేశంతోనే బీజేపీతో చేతులు కలిపానని ఇప్పుడు మోడీ మనలను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా రావచ్చని మీరంతా చైతన్యంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలంతా వలయంలా చుట్టూ ఉండాలని బాబు విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఆడుతున్న ఆటలకు అడ్డుకట్ట వేయాలంటే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లూ తెదేపా గెలుచుకుని ప్రధాని పదవిని నిర్ణయించే విధంగా ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మనం రాజీనామా చేసినా కేంద్రానికి నష్టం లేకపోవడంవల్లే మోడీ ఆటలు సాగుతున్నాయని వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. కాగా తాను దేనికైనా సిద్ధమని సమస్యలు తనకు కొత్త కాదని ఎన్నో ఎదుర్కున్న అనుభవం తనదని పదే పదే ప్రకటించుకునే చంద్రబాబు తాజాగా ఇలా తన చుట్టూ వలయంగా ఏర్పడి తనను రక్షించాలంటూ వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మం ఏంటనే విశ్లేషణలు ఊపందుకున్నాయి.
కేవలం ప్రస్తుత రాజకీయాలను పక్కదారి పట్టించేందుకు మాత్రమే బాబు ప్రయత్నిస్తున్నారని, దీనివెనుక ఉన్న వ్యూహం రాజకీయాలే తప్ప మరేమీలేదని అంటున్నారు. నిజానికి కేంద్రం బాబుపై పగబట్టినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఒక వేళ ప్రస్తుతం కేంద్రం ఒక్కసారిగా చంద్రబాబుపై కన్నెర్ర చేసి.. ఏమైనా కేసులు, జైళ్లు అంటూ హడావుడి చేసినా కేంద్రపై ప్రజల్లో మరింత ఆగ్రహం పెరగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. అయితే, రాష్ట్రంలో అవినీతిపై మాత్రం కేంద్రం ఆరాతీస్తోందని, ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సైతం.. తన వ్యాఖ్యల్లో ఏపీలో అవినీతి విషయాన్ని ప్రస్థావించారని అంటున్నారు.
అయినప్పటికీ.. మరో ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని చంద్రబాబుపై చర్యలు తీసుకునే సాహసం ప్రధాని మోడీ ఎన్నటికీ చేయబోరని అంటున్నారు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్ని ప్రత్యేక హోదా పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు, ప్రజలు తన పక్షాన తిరిగేందుకు మాత్రం బాబు ఇలాంటి సెంటిమెంట్లు ప్లే చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి బాబు సెంటిమెంట్ డైలాగులు ఎం త మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.