దొంగ బాబాలు, నకిలీ స్వామీజీల వ్యవహారాలు వరుసగా వెలుగు చూస్తున్న క్రమంలో దైవాంశ సంభూతులమని ప్రకటించేవారిని నమ్మి మోసపోకండంటూ మొత్తుకుంటున్నా.. వీర భక్తులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. వివాదాస్పద మాత రాధేమా విషయంలోనూ అంతే.. ఆమె పై ఎన్ని ఆరోపణలు వచ్చినా..ఎన్ని సార్లు టీవీలో లైవ్ కాస్టు వచ్చినా..ఆమెను పిచ్చిగా కొలిచే భక్తులు ఇంకా ఉన్నారు. ఆ మద్య దక్షిణ ఢిల్లీలోని వివేక్ విహార్ పోలీస్ స్టేషన్కు రాధే మా వెళ్లింది.
ఈ సందర్భంగా స్టేషన్ ప్రధానాధికారి ఎదురెళ్లి మరీ మాతాజీకి స్వాగతం పలికాడు. పైగా తన కుర్చీలోనే ఆమెను కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు. ఆ ఫోటోలు బయటకు పొక్కగా.. ఆ అధికారి నిర్వాకంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఎన్నో సంఘటనలు మాత రాధేమా విషయంలో సంచలనాలు రేపాయి. తాజాగా రాధేమా కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
తన కుమారుడి బావమరిది వివాహంలో రాధేమా నృత్యాలు చేశారు. జైపూర్ కు చెందిన వ్యాపారి ఎంఎం మిఠాయివాలా పేరిట రిటైల్ చైన్ స్వీట్స్ స్టోర్ లను నిర్వహిస్తున్న మన్మోహన్ గుప్తా మనవరాలితో కుమారుడి బావమరిదికి వివాహ నిశ్చితార్థం జరిగింది.
ఎరుపు రంగు దుస్తులు, భారీగా ఆభరణాలు ధరించి స్టయిలిష్ లుక్ లో కనిపిస్తున్న ఆమె, లేచి డ్యాన్స్ చేయడం ప్రారంభించగానే, బంధుమిత్రులు, భక్తులు కూడా అదే పని చేశారు. ఈ వీడియోను తీసిన వారు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా అదిప్పుడు వైరల్ అవుతోంది.