రాజకీయాలకే పాఠం నేర్పే రాజకీయ గురువు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఆయనకే పాఠాలు నేర్పే రేంజ్కు ఎదిగిపోయిందట మంత్రి భూమా అఖిల ప్రియ! ఏంటి ఆశ్చర్యం అనిపిస్తోందా? అయినప్పటికీ.. నిజమే అంటున్నారు పరిశీలకులు. తాజాగా మంత్రి భూమా అఖిల ప్రియ ముఖ్యమంత్రి క్యార్యాలయానికి ఓ ఫ్యాక్స్ నోటీసు పంపించినట్టు అమరావతి వర్గాలు చెబుతున్నాయి. ఈ నోటీసులో మంత్రి అఖిల చంద్రబాబుకే ట్విస్ట్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు రాజకీయాల్లో అందునా సొంత పార్టీలో తాను ప్రశ్నించడమే తప్ప.. తనను ప్రశ్నించిన వారు లేరని చంద్రబాబు అంటారు.
అయితే, అనూహ్యంగా చంద్రబాబునే ప్రశ్నించే రేంజ్కు ఎదిగిపోయింది అఖిల ప్రియ. గత కొన్నాళ్లుగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి, మంత్రి భూమా అఖిల ప్రియకు మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇటీవల చంద్రబాబు ప్రత్యేక హోదా సాధన యజ్ఞంలో భాగంగా ఏపీలోని ప్రతినియోజకవర్గంలోనూ దీక్షలు చేపట్టాలని, సైకిల్ ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగా ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో సైకిల్ యాత్ర చేపట్టారు. అయితే, దీనిపై రాళ్లదాడి జరిగి తీవ్ర వివాదం జరిగింది. దీనికి మంత్రి అఖిల కారణమని సుబ్బారెడ్డి వ్యానించారు.
ఇది మొత్తం అమరావతికి చేరింది. ఇద్దరు నేతల మధ్య వివాదం ముదిరి పోకుండా ఉండేందుకు చంద్రబాబు ఇద్దరికీ క్లాస్ ఇవ్వాలని భావించి అమరావతికి రావాలని ఆదేశించారు. అయితే, ఏవీ సుబ్బారెడ్డి ఈ భేటీకి వచ్చారు కానీ, మంత్రి అఖిల ప్రియ మాత్రం రాలేదు. దీంతో ఆమె విషయంపై ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా పొలిట్ బ్యూరోలో చర్చించాలని నిర్ణయించారు. అయితే, ఇంతలోనే.. భూమా అఖిల ప్రియ సీఎం చంద్రబాబుకు ఓ ప్రశ్నావళిని పంపింది. సుబ్బారెడ్డిని ఏ హోదాలో సమావేశానికి ఆహ్వానిస్తున్నారు? ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా నేను(మంత్రి అఖిల) ఉండగా అదే నియోజకవర్గంలో మరోనేత ఏలా సైకిల్ యాత్ర చేపడుతారు? ఇలా అయితే, నాకు నియోజకవర్గంలో విలువ ఎక్కడ ఉంటుంది? ఇలాంటి పరిణామాలను పార్టీ కూడా అనుమతించకూడదు.
కొంతమంది సుబ్బారెడ్డిని ప్రొత్సహించడం వల్లే ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల పార్టీలో విభేదాలు సృష్టించేందుకే ఆయన ప్రయత్నిస్తున్నాడు! ఇలాంటి పరిణామాలను టీడీపీ అధినేత సహా నేతలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ లేఖ టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు టీడీపీలో సీనియర్ మోస్ట్లు కూడా తమలో ఎంత అసహనం, కోపం ఉన్నా.. కూడా చంద్రబాబుపై ఎప్పుడూ ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది లేదని, అలాంటిది రాజకీయంగా ఇంకా కన్ను తెరవని భూమా అఖిల ఇలా బాబును ప్రశ్నించడం ఏంటని అంటున్నారు. మరి ఈ పరిణామాన్ని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.